రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారా… నిజమేనా.. ఎందుకలా..

కరుడుగట్టిన హిందూత్వవాది, ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్ పార్టీ మారుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన కాషాయ కండువ పక్కన పడేసి తన అనుచరులతో సహా సైకిలెక్కుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో ఉండి ప్రయోజనం లేదని అనుకుంటున్నట్లు సమాచారం. పైగా కమలం పార్టీలో కూడా తగిన గ రవం లేదని అంటున్నారు.

కాసానిలో చర్చ

నిజానికి రాజాసింగ్ తొలుత పక్క చొక్కా తొడుక్కున్నారు.2009లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేష్‌గౌడ్‌పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓ వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడే బీజేపీ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

పార్టీ అధిష్టానంపై అసంతృప్తి

రాజా సింగ్ కు గో రక్షకుడన్న పేరుంది. గోవులను కబేళాలకు తరలిస్తుంటే వెంటబడి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారాయన. ఆయన హిందూత్వవాద ప్రకటనల కారణంగా తరచూ కేసులు నమోదవుతుంటాయి. ఇప్పుడు మాత్రం రాజాసింగ్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సస్పెండై ఆరు నెలలు అవుతున్నా సస్పెన్షన్‌ ఎత్తివేతపై బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. పార్టీలో సఖ్యతగా ఉంటూ బండి సంజయ్ తమ నాయకుడని పదే పదే ప్రకటించినప్పటికీ అధిష్టానం కనికరించలేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఆయన మూడు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. మరో రెండుమూడు రోజుల్లో రాజాసింగ్‌కు మార్గం సుగమం అవుతుందని, గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.పైగా తనకు అవకాశం ఇస్తే సిటీలో మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తానని రాజా సింగ్ చెప్పుకున్నారట..

ఫోన్ స్విఛాఫ్…

టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో రాజాసింగ్ తన ఫోన్ స్విచాఫ్ చేశారు. ఆయన హైదరాబాద్ లో లేరని బీజేపీకి సంబంధించిన పని మీదే షోలాపూర్ వెళ్లాలని రాజాసింగ్ అనుచరులు చెబుతున్నారు. దానితో ఇప్పుడు వార్తలను ఆమోదించడానికి గానీ, ఖండించడానికి గానీ అవకాశం లేకుండా పోయింది. రాజాసింగ్ అందుబాటులోకి వస్తేనే ఏ విషయమైనా తెలుస్తుంది.