సునీతమ్మ మౌనం వెనుక ఏముంది? : అవినాష్‌రెడ్డి

వివేకా హ‌త్య కేసుకు సంబంధించి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా వ‌రుస సెల్ఫీ వీడియోలు విడుద‌ల చేశారు. అన్నీ నిజాలే చెబుతున్నానంటూ.. ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. వివేకా కుమార్తె సునీత‌, ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిపై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబ‌రు 7(2019) వ‌ర‌కు.. ఈ కేసులో ద‌స్త‌గిరిని సీబీఐ అరెస్టు చేయ‌లేద‌ని.. ఆ త‌ర్వాత కూడా.. అత‌నికి స‌హ‌క‌రించేలా వ్య‌వ హ‌రించింద‌ని అవినాష్‌రెడ్డి చెప్పారు.

త‌న తండ్రిని చంపాన‌ని బ‌హిరంగంగా చెప్పిన అప్రూవ‌ర్‌పై సునీత ఎందుకు ప్ర‌శ్న‌లు సంధించ‌డం లేద‌న్నారు. తానే గొడ్డ‌లి కొని తెచ్చాన‌ని.. తానే నరికాన‌ని చెబుతున్న అప్రూవ‌ర్ ముంద‌స్తు బెయిల్‌కు పిటిష‌న్ వేశాడ‌ని.. ఆయ‌న‌కు ఎవ‌రు స‌హ‌క‌రించారో తెలియాల్సి ఉంద‌ని అవినాష్ అన్నారు. అంతేకాదు.. ఇంత జ‌రిగినా.. సునీత ఎందుకు.. అప్రూవ‌ర్ బ‌య‌ట తిర‌గాల‌ని అనుకుంటున్నారో తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

దేశంలో ఎక్క‌డైనా.. తానే న‌రికాన‌ని చెప్పిన వ్య‌క్తిని బ‌య‌ట తిరిగేందుకు సీబీఐ కానీ, ద‌ర్యాప్తు సంస్థ‌లు కానీ.. అంగీక‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. సీబీఐ బెయిల్‌కు నో అబ్జెక్ష‌న్ లెట‌ర్ ఇచ్చార‌ని తెలిపారు. కిరాయి హంత‌కుడికి(ద‌స్త‌గిరి) ఇంత రిలీఫ్ ఇస్తుంటే.. సునీతమ్మ ఏం చేస్తున్నార‌ని అవినాష్ ప్ర‌శ్నించారు. ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ‌ను ఇరికించార‌ని అవినాష్ ఆరోపించారు.

మ‌మ్మ‌ల్ని ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీకి వ్య‌తిరేకంగా సునీత‌మ్మ‌, ఆమె భ‌ర్త కూడా చేతులు క‌లిపార‌ని.. నిత్యం కొంద‌రు నేత‌ల‌తో వారు మాట్లాడుతున్నార‌ని.. వీరిలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు కూడా ఉన్నార‌ని.. అవినాష్ ఆరోపించారు. నిజాన్ని ఎవ‌రూ దాచ‌లేర‌ని.. నిజాలు ఎప్ప‌టికైనా తేలతాయ‌ని అవినాష్ చెప్పుకొచ్చారు. మొత్తంగా సీరియ‌ల్ రూపంలో షార్ట్ వీడియోలు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.