14 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవా?

అనంతపురం జిల్లా…ఏపీలోని 13 జిల్లాల్లో ఒకటి…. బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతంగా పేరు గాంచిన జిల్లా ఇది. కానీ, ఎన్నో దశాబ్దాలుగా అనంతపురం జిల్లాను కరువు రక్కసి కబలిస్తోంది. వర్షాలు లేక, ఉపాధి దొరక్క…గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోతున్నాయి. కొన్ని పల్లెల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉందంటే అనంతపురం వెనుకబాటు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. కరువు, ఏటా తగ్గిపోతున్న వర్షపాతం, పాతాళానికి పడిపోతున్న భూగర్భజలాలు…ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో చాలామంది బలవంతంగా సొంతూళ్లను విడిచి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు పొట్టచేతబట్టుకొని వలస వెళ్లాల్సిన పరిస్థితి. రాజకీయ వెనుకబాటుతనం వల్లే అనంతపురం జిల్లా ఇంకా వెనుకబడి ఉందని రాజకీయ మేధావులు సైతం విశ్లేషిస్తున్నారు.

పాలకులంతా ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపుతూ…జిల్లావాసులను మధ్యపెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు అనంతపురం ప్రజలపై రాజకీయ నేతలకు చిన్నచూపు ఓ వైపు….గెలిచిన ఆ రాజకీయ నాయకులపై అధికారంలో ఉన్న పార్టీ చిన్నచూపు మరోవైపు…వెరసి అనంతపురం రాజకీయంగానూ వెనుకబడుతూనే ఉందని అంటున్నారు. 14 మంది ఎమ్మెల్యేలున్న అనంతపురానికి ఒక్క మంత్రిపదవే దక్కడం ఆ రాజకీయ వెనుకబాటుతనానికి అద్దం పడుతోందన్న అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆ ప్రాంత రాజకీయ నేతలు…వైసీపీ శ్రేణులు సైతం పెదవి విరుస్తున్నారట. 14 మంది ఎమ్మెల్యేలున్న అనంతపురం జిల్లాకు ఒకటే మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఆ మాటకొస్టే ఉమ్మడి ఏపీలో అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహించేవారని, ఇపుడు రాష్ట్రం విడిపోయాక కేవలం 13 జిల్లాలే ఉన్నా ఒక్క మంత్రి పదవి మాత్రమే దక్కిందని మదనపడుతున్నారట. ఏపీలో తమకంటే చిన్న జిల్లాలకు రెండేసి మంత్రి పదవులు ఇచ్చి అనంతపురానికి ఒక్క మంత్రి పదవే ఇవ్వడం..రాజకీయ వివక్షేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మంత్రి పదవులు సంగతి పక్కనబెడితే. .నామినేటెడ్ పోస్టులు కూడా పెద్దగా దక్కలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇక, రాజధాని విషయంలోనూ అనంతపురం వైసీపీ శ్రేణలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. నాడు రాజధానిగా అమరావతి ఎంపిక విషయంలోనూ…నేడు పాలనా రాజధానిగా విశాఖపట్నం విషయంలోనూ సంతృప్తిగా లేరట. అనంతపురంలోని హిందూపురానికి తమ రాష్ట్ర రాజధాని కంటే కూడా తమిళనాడు, కర్ణాటక రాజధానులు దగ్గరన్న భావన వారిలో బలంగా ఉందట. మరి, ఈ అసంతృప్తులను వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.