విచారణలో ముగ్గురినీ కలుపుతారా ?

వివేకానందరెడ్డి హత్యకేసులో ముగ్గురిని కలిపి విచారించేందుకు సీబీఐ రెడీ అవుతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిని ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి హైకోర్టు అనుమతించింది. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని 25వ తేదీవరకు అరెస్టు చేయద్దని సీబీఐని ఆదేశించిన హైకోర్టు విచారణలో సహకరించాలని ఎంపీకి చెప్పింది.

బుధవారం అవినాష్ ను సీబీఐ ప్రశ్నించబోతోంది. అందుకనే తమ ఆఫీసుకు రమ్మని నోటీసిచ్చింది. ఎలాగూ అవినాష్ వస్తారు కాబట్టి ఇదే సమయానికి డాక్టర్ ఉదయ్, భాస్కర్ ను కూడా ఆఫీసుకు తీసుకొచ్చే అవకాశముందని సమాచారం. జైల్లోనే వీళ్ళిద్దరిని విచారించేట్లయితే తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టును సీబీఐ అడగాల్సిన అవసరంలేదు. అయినా అడిగిందంటే ఉద్దేశ్యం ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతోంది. భాస్కర్ రెడ్డి ఎంపీకి తండ్రి అయితే డాక్టర్ అత్యంత సన్నిహితుడు.

అందుకనే ముగ్గురిని కలిపి విచారిస్తేనే చాలా విషయాలు బయటకు వస్తాయని సీబీఐ అనుకుంటోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపీ విషయంలో సీబీఐ ప్రధానంగా ఆధారపడింది గుగుల్ టేకౌట్ సాంకేతికత మీదనే. అయితే దాన్ని ప్రామాణికంగా తీసుకునేందుకు లేదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఎంపీ ప్రజాప్రతినిధి కాబట్టి ప్రతిరోజు ఎంతోమంది ఎంపీ దగ్గరకు వచ్చి వెళుతుంటారు. ఎక్కడైనా నేరం చేసిన వాళ్ళు ఎంపీ ఇంటికి వచ్చి వెళ్ళినంత మాత్రాన ఎంపీకి కూడా నేరంలో భాగస్వామ్యముందని ఎలా చెప్పగలరన్న హైకోర్టు ప్రశ్నకు సీబీఐ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు.

గుగుల్ టేకౌట్ ద్వారా మొబైల్ ఫోన్ మూమెంట్ ఏ రోజు ఏ గంటలో ఎక్కడుందో చెప్పచ్చేకానీ జరిగిన నేరంతో ఎవరెవరికి సంబంధాలున్నాయో చెప్పే అవకాశంలేదని కోర్టు చెప్పింది. దాంతో సీబీఐ లాయర్ కు ఏమిమాట్లాడాలో దిక్కుతోచలేదు. కాబట్టి గుగుల్ టేకౌట్ ఒక్కదాన్నే ఆధారంగా చేసుకుని ఎంపీని దోషిగా తేల్చాలంటే అది జరిగేపనికాదని తేలిపోయింది. కాంక్రీట్ ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోర్టు ప్రశ్నకు లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. అందుకనే కోర్టు ఎంపీకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. మరి తాజా విచారణలో సీబీఐ ఎలాంటి సాక్ష్యాలు సేకరిస్తుందో చూడాలి.