ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు భారీ షాక్ ?

కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 14 ప్రతిపక్షాలు ఉమ్మడిగా వేసిన ఒక పిటీషన్ను సుప్రింకోర్టు ఒకే దెబ్బతో కొట్టి అవతల పడేసింది. అసలు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సమస్య ఏమిటి ? ప్రతిపక్షాలన్నీ ఎందుకు ఏకమయ్యాయి ? వాటి బాధేమిటి ? అని తెలుసుకోవాలని కూడా సుప్రింకోర్టు అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్ధలతో ప్రతిపక్ష నేతలను కేంద్రప్రభుత్వం వేధిస్తోందని, తప్పుడు కేసులు పెడుతోందని ప్రతిపక్షాలు చాలాకాలంగా గోలచేస్తున్నాయి.

తమ గోలనే పిటీషన్ రూపంలో సుప్రింకోర్టులో దాఖలుచేశాయి. అయితే కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చండ్రచూడ్ మాట్లాడుతు విపక్ష నేతలకు ప్రత్యేకమైన మార్గదర్శకాలు కావాలా ? అని అడగటమే ఆశ్చర్యంగా ఉంది. నాయకులకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించలేమన్నారు. కేసుల నమోదు, విచారణలో సాధారణ పౌరులకు ఎలాంటి నిబంధనలుంటాయో రాజకీయ నేతలకు కూడా అవే వర్తిస్తాయని చెప్పారు. ప్రతిపక్షాలకు షాక్ కొట్టేట్లుగా కామెంట్ చేయటమే కాకుండా ఈ పిటీషన్ కు అసలు విచారణార్హతే లేదని కొట్టేశారు.

సుప్రింకోర్టు చర్యతో ప్రతిపక్షాల నేతలందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ప్రతిపక్షాల నేతలు ఎదుర్కొంటున్న ఆరోపణల్లాంటివే బీజేపీకి చెందిన కొందరు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, మంత్రులు ఎదుర్కొంటున్నారు. అవినీతి, మనీల్యాండరింగ్, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళజోలికి దర్యాప్తుసంస్ధలు వెళ్ళటంలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. నరేంద్రమోడీని నిలదీస్తున్నా, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే దర్యాప్తు సంస్ధలు కేసులు నమోదుచేసి వేధిస్తున్నాయనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.

కేంద్రానికి వ్యతిరేకంగా ఇన్ని ప్రతిపక్షాలు ఏకమైతే సుప్రింకోర్టు విషయం తీవ్రతను పట్టించుకోలేదని ప్రతిపక్ష నేతలు మొత్తుకుంటున్నారు. తమకు ప్రత్యేక మార్గదర్శకాలు కావాలని అసలు తాము అడగనే లేదన్న విషయాన్ని ప్రతిపక్షాల నేతలు గుర్తుచేస్తున్నారు. తమ బాధేమిటో కూడా సుప్రింకోర్టు వినలేదని, తమ గోడు సుప్రింకోర్టు కూడా పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలని శివసేన నేతలంటున్నారు. తమ ఆరోపణలకు ఆధారంగా ప్రతిపక్షాలు ఒక్క కేసును కూడా ఉదాహరణగా చూపలేదన్నది చీఫ్ జస్టిస్ భావన. అయితే విచారణ సందర్భంగా ఉదాహరణలు ఇద్దామని అనుకున్నామనేది ప్రతిపక్ష నేతల వాదన. ఏదేమైనా పిటీషన్ను సుప్రింకోర్టు కొట్టేయటం సంచలనంగా మారింది.