అభ్యర్థుల ఎంపికకు అమెరికా మోడలా?

అభ్యర్ధుల ఎంపికలో బీజేపీ కొత్తగా అమెరికా మోడల్ ను ఫాలో అవుతోంది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకోసం 224 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిన అభ్యర్ధులను ఎంపిక చేయటానికి అగ్రనాయకత్వం రెడీ అవుతోంది. ప్రతి నియోజకవర్గంలోను సిట్టింగ్ ఎంఎల్ఏలతో పాటు ముగ్గురు నలుగురు నేతలు టికెట్లకోసం పోటీ పడుతున్నారు. అందుకనే గట్టివాళ్ళని ఎంపిక చేయటంలో భాగంగా అమెరికా మోడల్ ను అప్లై చేయాలని డిసైడ్ అయ్యింది.

డిసైడ్ అవ్వటమే కాదు మొన్నటి శుక్రవారం అమలుచేసింది కూడా. ఇంతకీ అమెరికా మోడల్ ఏమిటంటే అమెరికాలో అధ్యక్షపదవి కోసం పార్టీల తరపున పోటీచేయాల్సిన అభ్యర్ధిని ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే కదా. అభ్యర్ధి ఎంపిక కోసం అంతర్గతంగా ఓటింగ్ నిర్వహిస్తారు. పోటీచేసిన వారిలో ఎవరికి ఎక్కువ ఓట్లొస్తే వాళ్ళే అమెరికా అధ్యక్షుడిగా పార్టీ తరపున పోటీచేస్తారు. ఇపుడు కర్నాటకలో ఇదే పద్దతిని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు.

ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోను టికెట్ కోసం పోటీపడుతున్న ముగ్గురు, నలుగురి జాబితాను రెడీచేసి పార్టీలోని వివిధ విభాగాల బాధ్యులు, సీనియర్ నేతలతో ఓటింగ్ నిర్వహించారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన పోలింగ్ వివరాలు ఈరోజు అంటే ఆదివారం పరిశీలిస్తారు. మొత్తం 224 నియోజకవర్గాల్లో జరిగిన పార్టీ అంతర్గత ఓటింగులో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వారినే అభ్యర్ధిగా పోటీచేయబోతున్నట్లు పార్టీ పరిశీలకులు ఇప్పటికే ప్రకటించేశారు.

అంతర్గత ఓటింగ్ ను పరిశీలించి 10వ తేదీలోగా జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అంటే ఏప్రిల్ 10వ తేదీన అభ్యర్ధుల ప్రకటన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత ఓటింగ్ ద్వారా అభ్యర్ధులను ఎంపికచేసే ప్రక్రియవల్ల పార్టీకి నష్టమో లాభమో తెలీటంలేదు. ఏదేమైనా ఒక పద్దతిని అనుకుంది కాబట్టి దాన్ని పార్టీ ఫాలో అయ్యింది. జాబితా ప్రకటించినపుడు మాత్రమే అసలు విషయం బయటపడుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సర్వేలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.