టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌

ఇదేంటి అనుకుంటున్నారా? ఔను.. ఇప్పుడు ఈ నెంబ‌ర్లే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారాయి. వైసీపీ నుంచి వ‌చ్చి త‌మ పార్టీలో చేరేవారి సంఖ్య‌పై టీడీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు ప్ర‌త్య‌క్షంగా.. టీడీపీ పంచ‌న చేరే అవ‌కాశం ఉంద‌ని తేలిపోయింది. వీరిలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌మీద‌కి వ‌చ్చిన నాయ‌కులు.

అయితే.. ఈ సంఖ్య‌పై టీడీపీలో చ‌ర్చ రోజు రోజుకు.. అంకెలు పెంచుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. నాలుగు కాస్తా 14కు, త‌ర్వాత 20, ఆ త‌ర్వాత 30.. ఇప్పుడు ఏకంగా 50 మందివ‌ర‌కు విష‌యం వెళ్లింది. ఈ 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా.. త‌మ‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని.. త‌మ నాయ‌కుడు.. క‌నుసైగ చేస్తే.. పార్టీ మార‌తార‌ని టీడీపీ నేత‌లు ఆఫ్ దిరికార్డుగా చెబుతున్నారు. వీరిలోనూ.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలే ఎక్కువ‌గా ఉన్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే.. ఇలా 50 మంది ఎమ్మెల్యేలు వ‌చ్చేస్తే.. టీడీపీ వారికి టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి ఉందా? అనేది మిలియన్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ కోసం.. క‌ష్ట‌ప‌డ్డ‌వారు.. పార్టీని న‌మ్ముకున్న‌వారు ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినంత మాత్రాన‌.. వారేమీ విఫ‌ల నేత‌లు కాదు క‌దా! ఏదో వైసీపీ హ‌వాలో ఒకింత వెనుక బ‌డ్డారు. మ‌రి.. ఇప్పుడు ఆ 50 మందినో.. లేక 30 మందినో తీసేసుకుంటే.. వారికి టికెట్లు ఎలా ఇస్తారు? అనేది ప్ర‌శ్న‌.

ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు విష‌యంలో పైకి ఏమీ తేల్చ‌కుండా.. నాన్చుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ వాద‌న‌కు ప్ర‌ధాన కార‌ణం.. టికెట్ల ర‌గ‌డేన‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇత‌ర పార్టీల‌తో పొత్తు లు పెట్టుకుంటే.. త‌మ టికెట్లు ఎక్క‌డ గ‌ల్లంత‌వుతాయోన‌నే బెంగ త‌మ్ముళ్ల‌లో క‌నిపిస్తోంది. దీంతో చాలా మంది నాయ‌కులు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో ఈ సంఖ్య‌లు పెంచేసి.. వైసీపీ నుంచి వ‌చ్చేస్తున్నార‌ని ప్ర‌క‌టించుకోవ‌డం వ‌ల్ల మేలు కంటే కూడా నాయ‌కుల్లో ఆత్మ‌స్థ‌యిర్యం దెబ్బ‌తీసేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.