అవిశ్వాసం పెడితే ఏమవుతుంది?

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. లోక్ సభ సెక్రటేరియట్ రాహూల్ గాంధిని ఎంపీగా అనర్హత వేటువేసిన విషయం తెలిసిందే. స్పీకర్ ఆదేశాల ప్రకారమే సెక్రటేరియట్ రాహూల్ పై అనర్హత వేటువేసిందని కాంగ్రెస్ అగ్రనేతలంతా మండిపోతున్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా దేశంలోని 16 ప్రతిపక్షాలు పోరుబాటు పట్టాయి. ఈ పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నాయి.

ఒకవైపు ఈ ఆందోళనలు చేస్తునే మరోవైపు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వ్యూహం రచిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేయాలి. తీర్మానం ప్రవేశపెట్టడం వరకు తేలికే కానీ అది నెగ్గాలంటే మార్గమేంటి ? తీర్మానంపై సంతకాలు చేయటానికి సరిపడా సంఖ్యాబలం కాంగ్రెస్ కే ఉంది. అయితే అన్నీ పార్టీలను కలుపుకుని వెళ్ళటంలో భాగంగా వీలైనన్ని పార్టీల ఎంపీల సంతకాలు తీసుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది.

ప్రతిపక్షాల్లోని 50 మంది ఎంపీలు సంతకాలు చేయటం కూడా పెద్ద కష్టంకాదు. కానీ సభలో తీర్మానం ఆమోదం పొందాలి, తర్వాత దానిపై చర్చ జరగాలి, ఆ తర్వాత ఓటింగ్ జరగాలి. ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ముందు అధికారపార్టీ అంగీకరించాలి. అంగీకరిస్తేనే తీర్మాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టగలవు. అధికారపార్టీ ఒప్పుకోకపోతే సభలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకవేళ ప్రవేశపెట్టినా చర్చలు జరిగేప్పుడైతే సమస్య వస్తుంది.

వీటన్నింటినీ దాటుకుని ఓటింగ్ దాకా వచ్చినా గెలుపు సాధ్యంకాదు. ఎందుకంటే లోక్ సభలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ ఉంది. ఎన్డీయే రూపంలో సుమారు 326 మంది ఎంపీల బలముంది. కాబట్టి ప్రతిపక్షాలన్నీ ఏకమైనా అధికారపార్టీని ఓడించటం సాధ్యంకాదు. కాబట్టి కాంగ్రెస్ ప్రవేశపెట్టాలని అనుకుంటున్న అవిశ్వాస తీర్మానం వీగిపోక తప్పదు. అయితే ఈ విషయాలు కాంగ్రెస్+ప్రతిపక్షాలకు తెలీదని అనుకునేందుకు లేదు. కాకపోతే స్పీకర్ చేసిన చర్యను నిరసించటమే ప్రతిపక్షాలు టార్గెట్ అని అర్ధమవుతోంది. వచ్చే సోమవారమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.