లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే భయమేసేది అన్నారు. ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నాపై ఎప్పుడూ మా తల్లికి కంప్లైంట్ చేసేది. నా పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడూ రాలేదు. అలాంటిది మీ మీటింగ్ కి ఆయన హాజరయ్యారు. ఎన్ని పనులు ఉన్నా, పని ఒత్తిడి ఉన్నా దేవాన్ష్ మీటింగ్ కి నేను వెళతాను…అని లోకేష్ వివరించారు..

విద్యా విలువలను పెంపోందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు ఇప్పించాం. తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదని చాగంటి చెప్పారు అని గుర్తు చేశారు. 

పిల్లల కోసం… పిల్లలకు అర్థమయ్యే విధంగా బాలల రాజ్యాంగం రూపొందించాం. పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించాము… ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారని తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా కొన్ని వాడుక పదాలు ఉన్నాయి… వాటిని ఎప్పుడూ వాడొద్దు… దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని లోకేష్ అన్నారు. గతంలో ఇంటి పనులు మహిళలే చేసే విధంగా పాఠ్యాంశాల్లో ఫొటోలు ఉండేవి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పనులు మహిళలతో పాటు మగవారు కూడా చేస్తున్నట్టుగా ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం అని తెలిపారు. ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతాం అన్నారు. 

భారత దేశంలో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని రెండేళ్లల్లో తీసుకురావాలని సీఎం ఆదేశించారు… దీన్ని నెరువెరుస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం నా వెనుకుండి నాకు సలహలు ఇస్తున్నారని ఆయన అన్నారు. విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, పిల్లలకు అందించే భోజనం వంటి అంశాల్లో నిత్యం చర్చించుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దు… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చండి.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీద్దాం అని లోకేష్ పిలుపునిచ్చారు.