ఏకమవుతున్న ప్రతిపక్షాలు…థ్యాంక్స్ టు బీజేపీ

గడచిన తొమ్మిదేళ్ళలో బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలు ఏకమైన ఘటన దాదాపు లేదనే చెప్పాలి. అలాంటిది ఇపుడు అన్నీ ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. అదికూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా. ఇంతకీ విషయం ఏమిటంటే లోక్ సభ ఎంపీగా రాహూల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. 2019 కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహూల్ మాట్లాడుతు దొంగలకంతా మోడీ ఇంటిపేరే ఎందుకుంటుంది అని సెటైర్లు వేశారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదిలి పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీలని రాహూల్ ఉద్దేశ్యం.

అయితే రాహూల్ మరచిపోయిందేమంటే మోడీ అనేది కేవలం ఇంటిపేరు మాత్రమే. గుజరాత్ రాష్ట్రంలో మోడీ అనే ఇంటిపేరున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు. వాళ్ళకంతా బీజేపీతో కానీ నరేంద్రమోడీతో కానీ ఎలాంటి సంబంధాలుండవు. అయితే బీజేపీ ఎంఎల్ఏ ఒకళ్ళు రాహూల్ తమ పరువుకు భంగం కలిగించారని సూరత్ కోర్టులో కేసువేశారు. ఆ కేసులోనే రాహూల్ కు రెండేళ్ళ జైలుశిక్షపడింది. రెండేళ్ళు జైలుశిక్ష పడిందన్న కారణంగా లోక్ సభ సెక్రటేరియట్ ఓవర్ యాక్షన్ చేసి రాహూల్ పై అనర్హత వేటువేసింది.

దీన్నే ఇపుడు దేశంలోని అన్నీ ప్రతిపక్షాలు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇపుడు రాహూల్ పైన పడిన అనర్హత వేటే రేపు ఏదో రూపంలో తమ సభ్యులపైన కూడా పడటం ఖాయమని ప్రతిపక్షాలు ఆందోళన పడుతున్నాయి. అందుకనే వీళ్ళు వాళ్ళు అని కాకుండా అన్నీ పార్టీలు ఏకమవుతున్నాయి. ఢిల్లీలో జరగబోయే నిరసన ర్యాలీలో అన్నీ పార్టీలు పాల్గొనబోతున్నాయి. రాహూల్ పై అనర్హత వేటు పడటాన్ని కేసీయార్ కూడా తీవ్రంగా ఖండించారంటేనే ఆశ్చర్యంగా ఉంది.

ఢిల్లీలో జరగబోయే ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనాలని, నిరసనల్లో భాగం కావాలని కేసీయార్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయే మీటింగుకు మమతాబెనర్జీ, నితీష్ కుమార్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఉత్ధవ్ థాక్రే లాంటి ప్రముఖులందరు సమావేశంలో పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది. యూపీఏ పక్షాలు ఎలాగూ పాల్గొంటాయి. అంటే ఢిల్లీ మీటింగులోను తర్వాత జరగబోయే ర్యాలీలోనే కాకుండా తర్వాత రాష్ట్రాల్లో జరగబోయే ఆందోళనల్లో కూడా ప్రతిపక్షాలు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షాలన్నింటినీ ఏకంచేసిన ఘనత బీజేపీకి కాకుండా ఇంకెవరికి దక్కుతుంది ?