జనసేనకు బిగ్ డే- బిగ్ డెసిషన్ తీసుకుంటారా?

Pawan kalyan

మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు అయిపోయాయి. అధినేత పవన్ కల్యాణ్ సభంటే జనాలకు కొదవేమీ ఉండదు. అయితే సమస్యంతా పవన్లోనే ఉంది. అదేమిటంటే ఎంతకాలమైనా విషయాన్ని తేల్చటం లేదు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే పొత్తులు. పొత్తులపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. అందుకనే పార్టీ నేతలు, మిత్ర, ప్రత్యర్ధి పార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది.

విషయం ఏమిటంటే బీజేపీ మిత్రపక్షమే కానీ కలిసున్నది పెద్దగా లేదు. ఏరోజన్నా రెండుపార్టీలు విడిపోయేవే అన్నట్లుగా ఉంది రెండుపార్టీల మధ్య సంబంధాలు. అలాగే తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు. అయితే బీజేపీని వదిలేస్తే ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది. బీజేపీతో కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే అందుకు కమలం పార్టీ అంగీకరించటం లేదని సమాచారం.

అందుకనే ఒకసారి టీడీపీతో పొత్తంటారు. మరోసారి తన పొత్తు నేరుగా జనాలతో అనే చెబుతారు. ఒకసారి బహిరంగ సభలో మాట్లాడుతూ జనసేనకు ఓట్లేసి గెలిపించాలంటారు. బీసీ, ఎస్సీ, కాపులు కలిస్తే రాజ్యాధికారం మనదే అని చెబుతారు. ఈ విధంగా సందర్భానికో మాట పవన్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధమే కావటంలేదు. పొత్తుల విషయంలో పవన్ క్లారిటిగా ఉండకపోతే, బహిరంగంగా ప్రకటించకపోతే నష్టపోయేది పవన్ మాత్రమే కాదు, పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ కూడా అని పవన్ గ్రహించాలి. పొత్తు విషయం తేలకపోతే చంద్రబాబు నాయుడు తన పార్టీలో టికెట్లను ఎలా ఫైనల్ చేయగలరు ?

పొత్తుపై చంద్రబాబు-పవన్లో క్లారిటీ ఉందేమో తెలీదు. ఆ క్లారిటి వాళ్ళిద్దరిలో ఉంటే సరిపోదు తమ్ముళ్ళతో పాటు కార్యకర్తల్లో కూడా ఉండాలి. అలా కాకుండా చివరి నిముషంలో పొత్తు ప్రకటిస్తే అది వికటించే ప్రమాదం ఎక్కువగా ఉంది. జనసేనకు పోయేదేమీ లేదు కానీ టీడీపీకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. టికెట్ మీద ఆశలు, నమ్మకంతోనే చాలామంది తమ్ముళ్ళు పార్టీలో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళల్లో కొందరికి టికెట్లు లేదని చివరి నిముషంలో చెబితే వాళ్ళు ఊరుకుంటారా ? కాబట్టి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అయినా క్లారిటీ ఇస్తే పవన్ కే మంచిది.