కిరణ్ సరే.. మోహన్ సంగతేంటి ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.అంతలోనే మరో ఆసక్తికర సంఘటన జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో భేటీ అయ్యారు. గంటకు పైగా ఏకాంతంగా సమావేశమం కావడం వెనుక కూడా పెద్ద కథే ఉందని అంటున్నారు.

మోహన్ బాబు, వీర్రాజు భేటీపై బీజేపీ వర్గాలు ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తెరపైకి తెచ్చాయి. ఏపీలో మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరేందుకే వీర్రాజు వెళ్లి మోహన్ బాబును కలిశారట. బీజేపీకి మద్దతుగా స్టేట్ మెంట్ కూడా ఇవ్వాలని అభ్యర్థించారట.

అసలు కథ వేరే ఉందని బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కిరణ్ కుమార్ రెడ్డి రాకతో మొదలయ్యే ఒరవడిని కొనసాగించాలంటే మరికొంతమంది పేరున్న వారిని చేర్చుకోవాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగానే మోహన్ బాబుతో వీర్రాజు సమావేశమై ఉంటారని భావిస్తున్నారు. పైగా వీర్రాజుకు సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డితో అధిష్టానమే చర్చలు జరపడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు నొచ్చుకున్నారు. కొందరిని చేర్చినట్లు తన ఖాతాలో కూడా వేసుకోవాలన్న తపనతో ఆయన మోహన్ బాబును కలిశారని కూడా అంటున్నారు..

మోహన్ బాబు తీరును మాత్రం నమ్మలేమని కొందరి వాదన. ఎందుకంటే ఆయన కుటుంబం నిలకడగా ఏ పార్టీలో ఉన్నదీ లేదు. ఒక సారి కుటుంబ సమేతంగా ఢిల్లీలో ప్రధాని మోదీ ఆతిథ్యం స్వీకరించిన మోహన్ బాబు అప్పుడు కూడా బీజేపీలో చేరేందుకు ముందుకు రాలేదు. తొలుత టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన మోహన్ బాబు గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఒకటి రెండు సార్లు జగన్, మంచు విష్ణుని పిలిచి కూడా మాట్లాడారు.

నిజానికి చాలా మంది సినీ జనానికి పదవులు ఇచ్చిన జగన్ ఎందుకో మోహన్ బాబు కుటుంబాన్ని మాత్రం అకామటేడ్ చేయలేదు. దానితో టీడీపీ వైపుకు మొగ్గుచూపేందుకు మోహన్ బాబు ప్రయత్నించారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఎక్కడుండాలో మోహన్ బాబు నిర్ణయించుకోలేకపోవడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. ఇప్పుడు బీజేపీతో కూడా అదే పరిస్థితి ఎదురుకావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.