ధర్మాన ప్రసాదరావు పై జగన్ సీరియస్?

శ్రీకాకుళానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు వింటే చాలు సీఎం జగన్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. గతంలోనూ ధర్మాన తీరు జగన్‌కు నచ్చనప్పటికీ ఆ తరువాత కొంత సానుకూలత ఏర్పడడంతో మంత్రి పదవి కూడా ఇచ్చారు. కానీ… తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జగన్ చెప్పిన సమీకరణలను కాదని తన సొంత లెక్కలు వేసి మరీ ఆయన్ను ఒప్పించి తనకు కావాల్సిన నాయకుడికి టికెట్ తెచ్చుకున్న ధర్మాన ఇప్పుడా అభ్యర్థిని గెలిపించుకోవడంలో తంటాలు పడుతున్నారు. విపక్షాలు పోటీలో లేకపోయినా వైసీపీ రెబల్ అభ్యర్థి బరిలో ఉండడం.. ఆయనకు మద్దతు దొరుకుతోంది. ఇదే జగన్‌కు కోపం తెప్పించింది.

స్థానిక సంస్థలలో రాష్ట్రవ్యాప్తంగా తిరుగులేని బలం ఉన్నప్పటికీ శ్రీకాకుళంలో పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి నానా పాట్లు పడుతుండడం ధర్మాన అసమర్థత తప్ప ఇంకేమీ కాదని జగన్ అన్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

స్థానిక సంస్థల కోటాలో నర్తు రామారావుకు వైసీపీ టికెట్ ఇచ్చారు. స్థానిక సంస్థలలో బలం లేకపోవడంతో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ… వైసీపీ నుంచే బూర్జ జడ్పీటీసీ రామకృష్ణ నామినేషన్ వేశారు. ఆయన్ను ఉపసంహరించుకోవాలని ఎంత కోరినా వినకుండా బరిలో నిలవడం దగ్గరే ధర్మానే విఫలమయ్యారు. ఇప్పుడు రెబల్ అభ్యర్థి రామకృష్ణ వైసీసీ సభ్యుల మద్దతు మూటగడుతుండడం.. దాన్ని నివారించలేక ధర్మాన వార్నింగ్‌లు ఇస్తుండడంతో విషయం జగన్ వరకు చేరింది.

ఇచ్చాపురంలో కీలక నేతల్లో ఒకరైన యాదవ వర్గానికి చెందిన నర్తు రామారావుకు ధర్మాన పట్టుపట్టి టికెట్ తెచ్చుకున్నారు. జిల్లాపరిషత్, మండలపరిషత్‌లలో తూర్పు కాపు సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో కాపు అంశం కీలకంగా ఉన్నప్పటికీ కూడా ధర్మాన ఒత్తిడి తలొగ్గి జగన్ నర్తు రామారావుకు టికెట్ ఇచ్చారు.

అయితే, వైసీపీకే చెందిన బూర్జ జడ్పీటీసీ రెబల్ గా నామినేషన్ వేశారు. రామకృష్ణ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆయనకు ఆ వర్గం సభ్యులంతా మద్దతు పలుకుతున్నారు. పైగా రెబల్ అభ్యర్థి కావడంతో విపక్షాలకు అక్కడక్కడా ఉన్న సబ్యులూ ఆయనకే మద్దతిస్తున్నారు. దీంతో నర్తు రామారావు గెలుపుపై అనుమానాలు ముసురుకుంటున్నాయి.

తాజాగా ధర్మాన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి వార్నింగ్ ఇచ్చారట.. ప్రతి 50 మందిని గమనించడానికి ఒక ప్రతినిధి ఉన్నారు.. అంతా తనకు తెలుస్తోందంటూ ధర్మాన వార్నింగ్ ఇవ్వడంతో కాపు నేతలు ఆ విషయం జగన్ వద్దకు చేర్చారట. దీంతో ధర్మానపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని… పొరపాటున కానీ నర్తు రామారావు ఓడిపోతే ధర్మానపై వేటు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.