ప్రభుత్వంపై మండిపోతున్న కాంట్రాక్టర్లు

బిల్లుల బకాయిల పేరుకుపోవటంతో ఇసుక కాంట్రాక్టర్లు ప్రభుత్వంపై మండిపోతున్నారు. తమకు వెంటనే బిల్లులు క్లియర్ చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవటమే మిగిలిందని నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. తమతో కాంట్రాక్టుచేసుకున్న జేపీ వెంచర్స్- ఐపీఎండీసీ భవనం పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం అమరావతిలోని ఏపీఎండీసీ ఆఫీసు దగ్గర జరిగిన గొడవ ఒక్కసారిగా సంచలనమైంది.

ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలోని జనాల ఇసుక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా జేపీ వెంచర్స్ లిమిటెడ్ అనే సంస్ధతో ఇసుక సరఫరాకు కాంట్రాక్టు చేసుకుంది. దాని ప్రకారం ఇసుక రీచులను ప్రభుత్వం సంస్ధకు అప్పగించింది. ఆ సంస్ధకు ఇసుక తవ్వకాలు, లోడింగ్, సరఫరా మొత్తానికి ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుంది. దాదాపు 300 మంది కాంట్రాక్టర్లు వేలాది టన్నుల ఇసుకను అవసరమైన వారికి గడచిన రెండేళ్ళుగా సరఫరా చేస్తున్నారు.

ఒప్పందం ప్రకారం బిల్లులను కాంట్రాక్టర్లకు జేపీ సంస్ధ నెల రోజుల్లో చెల్లించాలి. కానీ ఇపుడు రెండేళ్లు దాటిన బిల్లులు రావటం లేదట. సమస్య ఎక్కడొచ్చిందంటే వినియోగదారుల నుండి ఇసుక డబ్బులను జేపీ సంస్ధ తీసుకుంటోంది కానీ ఇటు ప్రభుత్వానికి అటు కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వటం లేదు. జేపీ సంస్ధ నుండే ప్రభుత్వానికి సుమారు రు. 500 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. అలాగే కాంట్రాక్టర్లకు కూడా జేపీ సంస్ధ సుమారు రు. 70 కోట్ల వరకు బిల్లులు చెల్లించాలట.

అంటే పనులు చేయించుకుంటోందే కానీ జేపీ సంస్ధ ఇటు ప్రభుత్వానికీ డబ్బులు కట్టకుండా అటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా బాగా ఇబ్బందులు పెడుతున్నట్లు అర్ధమవుతోంది. దాంతో కాంట్రాక్టర్లంతా జేపీ సంస్ధపై మండిపోతున్నారు. డైరెక్టుగా సంస్ధ యాజమాన్యంతో మాట్లాడే అవకాశం లేకపోవటంతో ప్రభుత్వం దగ్గరకు వచ్చారు కాంట్రాక్టర్లు. ఏపీఎండీసీ అధికారులతో కాంట్రాక్టర్లు వాగ్వాదానికి దిగారు. బిల్లులు రాబట్టుకునేందుకు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం కనబడలేదని కాంట్రాక్టర్లు మండిపోతున్నారు. అందుకనే వేరేదారిలేక ఆత్మహత్యలు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వీళ్ళు చెబుతున్నారు. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని వెంటనే బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేస్తుందా ? చూడాల్సిందే.