రెచ్చిపోతున్న ప్రవీణ్ ప్రకాష్

ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. రోజు బడులను సందర్శిస్తూ బోధనా, బోధనేతర సిబ్బందిని హడలెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా క్లాస్ రూములోకి వెళ్లి పిల్లల నోట్సులను పరిశీలిస్తున్నారు. పిల్లల నోట్సులు సరిగ్గా లేకపోతే టీచర్లను, డీఈవోలను తిడుతున్నాడు. సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తున్నారు.

సార్ టైమ్ టేబులు

బడిలో టైమ్ టేబుల్ అమలువుతుందో లేదో చెప్పడం కష్టం. ప్రవీణ్ ప్రకాష్ మాత్రం టైమ్ టేబులు వేసుకుని మరీ పాఠశాలలను సందర్శిస్తున్నారు. నాడు నేడు పనులను పరిశీలించే క్రమంలో భాగంగా వస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కెమెరాల సాక్షిగా బోధనా సిబ్బందిపై విరుచుకుపడటంతో వాళ్లు బక్కచిక్కి దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. కొంతమంది డిప్రషన్ లోకి వెళ్లిపోతున్నట్లు సమాచారం. విద్యాశాఖ కమిషనర్ గా సురేష్ కుమార్ ఉన్నారన్న సంగతి మరిచిపోయే విధంగా ప్రవీణ్ ప్రకాష్ అన్నీ తానై హడావుడి చేసేస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ నీ సంగతి చూస్తా.. నిన్ను సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తూ విసుగు, భయం పుట్టిస్తున్నారు.

నిజానికి సీఎం జగన్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ ప్రకాశ్ ను గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పంపారు. గతేడాది అక్టోబరులోనే మళ్లీ ఏపీకి తీసుకొచ్చి రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. నెల రోజులకే మళ్లీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదలీ చేశారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ డెస్క్

ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ ప్రవీణ్ ప్రకాష్ ఒక గ్రూపును సిద్ధం చేశారు. అందులో వీడియోలు, నోటీసులు పోస్టు చేస్తున్నారు. అవి విద్యాశాఖలో అందరూ చూస్తున్నారా లేదా అని మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే… ప్రిన్సిపల్ సెక్రటరీ డెస్క్ లో ఉన్న సమాచారాన్ని ఎందుకు చూడలేదంటూ వారిపై కన్నెర్ర చేస్తున్నారు.

కసి కొద్ది..

ఉపాధ్యాయులపై ఉన్న కసి కొద్దీ ప్రవీణ్ ప్రకాష్ ను జగన్, ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారని చెబుతున్నారు. ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వం మాట వినడం లేదని, జగన్ ను విమర్శిస్తున్నారన్న అక్కసుతో వాళ్ల సంగతి చూసే బాధ్యత ప్రవీణ్ ప్రకాష్ కు అప్పగించారన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రవీణ్ మాత్రం టీచర్లనే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టమెంట్ లో అందరినీ అల్లాడించేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోకుండా అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నోట్సులు కరెక్షన్ చేయలేదని, సిలబస్ పూర్తి చేయలేదని ఇలా ప్రతీ అంశాన్ని కదిలిస్తూ తెగ తిట్టేస్తున్నారు.

జగన్ పై కోపమా…

ప్రవీణ్ ప్రకాష్ కు సీఎం పేషీలో ఉండాలని కోరిక. సీఎం అప్పగించిన పనులను తానే నిర్వహించాలని ఆయన ఆకాంక్ష. ఎందుకో ఇప్పుడా అవకాశాలు రావడం లేదు. దానితో ప్రవీణ కాస్త నిరాశకు, ఆగ్రహానికి లోనవుతున్నట్లు సమాచారం. విద్యాశాఖలో పోస్టింగ్ రావడంతో తన కోపాన్ని ఇలా బోధనా, పర్యవేక్షక సిబ్బందిపై వెల్లగక్కుతున్నారని చెబుతున్నారు..

గుంటూరు, పల్నాడు

ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టి ఇప్పుడు గుంటూరు, పల్నాడు జిల్లాలపై పడింది. రెండు రోజుల క్రితం ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని బడులను సందర్శించి బోధనా సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. టెండరింగ్ ప్రక్రియలో లోపాల కారణంగా పనులు జాప్యమైనప్పటికీ సిబ్బందిపై ఆగ్రహం చెందారు. ఇక డీఈఓలు, ఆర్డీఓలకు ఛార్జ్ మెమోలు జారీ చేస్తానని హెచ్చరించడం మాములు విషయమై పోయింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన పల్నాడు జిల్లాల్లోకి ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు..

వస్తే రానివ్వండి..

జగన్ ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన ఉపాధ్యాయులు ప్రవీణ్ ప్రకాష్ ఓవరాక్షన్ పైనా తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఇప్పటికే బోధనా భారం పెరగడం, బోధనేతర పనులు అందుకు జతకావడంతో క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ దెప్పిపొడుపులు మరింత ఇబ్బందికరంగా మారాయి. చాలా మంది ఉపాధ్యాయులు ఇప్పుడు తెగించేసినట్లుగా కనిపిస్తోంది. ప్రవీణ్ ప్రకాష్ వస్తే రానివ్వండి గట్టిగా సమాధానం చెబుదామని సిద్ధమవుతున్నారు. సస్పెండ్ చేసినా భయపడకూడదని కొందరు టీచర్లు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది..