జగన్ కు కొండపి టెన్షన్

ప్రకాశం జిల్లా కొండపి వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. వర్గపోరు భగ్గుమంటోంది. వైసీపీ నేతల ఆధిపత్య పోరు పార్టీని బజారున పడేస్తోంది. ప్రస్తుత ఇన్‌చార్జ్‌, మాజీ ఇన్‌చార్జ్‌ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమారం రేపుతోంది. ఇళ్లపై దాడి చేసుకునే స్థాయికి విభేదాలు పెరిగాయి.

ఇప్పటిదాకా ప్రత్యర్థి టీడీపీపై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు అంతర్గతంగా కొట్లాడుకుంటున్నారు. ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన కొండపి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రస్తుతం వరికూటి అశోక్‌బాబు పని చేస్తున్నారు. అయితే.. అశోక్‌బాబు పెత్తనాన్ని మాజీ ఇన్‌ఛార్జ్ వెంకయ్య, అతని వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. అంతటితో ఆగకుండా భౌతికదాడులకు దిగుతున్నారు.

ఎన్నికల ముందు వరకు నియోజకవర్గం ఇంఛార్జ్ గా ఉన్న అశోక్ బాబుకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకున్న డాక్టర్ వెంకయ్యకి వైసీపీ టిక్కెట్ దక్కింది. అయితే.. వెంకయ్యకు టిక్కెట్ ఇవ్వడాన్ని అశోక్‌బాబు వర్గం వ్యతిరేకించింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసి వెంకయ్య ఓటమి పాలైనా.. వైసీపీ అధికారంలోకి రావడంతో పెత్తనం కోసం అశోక్ బాబు పావులు కదిపారు. అదేసమయంలో.. వైసీపీకి రెబల్ నాయకుడిగా మారి పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ అశోక్‌బాబుని వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత.. ప్రకాశం జిల్లాలో పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో అశోక్‌బాబు మళ్లీ పార్టీలో క్రియాశీలంగా మారారు. అంతే ఇంఛార్జ్ పదవి నుంచి వెంకయ్యను తొలగించి అశోక్ బాబుకు ఆ పదవిని అప్పగించారు.

అశోక్ బాబు ఇంఛార్జ్ పదవిని చేపట్టినప్పటి నుంచి వెంకయ్య వర్గం ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. వెంకయ్య వర్గానికి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, నామినేటెడ్ పదవులు పొందిన నేతలు అశోక్‌బాబుకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసిన అశోక్‌బాబును ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన మోసాలకు దిగుతున్నారని కరపత్రాలు కూడా పంచారు.

సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గం నుండి వ్యతిరేకత పెరగడంతో అశోక్ బాబు అసహనానికి లోనయ్యారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. అశోక్ బాబు స్వయంగా వెళ్లి వారితో గొడవ పడ్డారు. దీనితో ఇప్పుడు అశోక్ బాబును తొలగించాలన్న డిమాండ్ తో వెంకయ్య వర్గం నిరసనలు నిర్వహిస్తోంది. మరి ఈ వ్యవహారాన్ని బాలినేని జగన్ దృష్టికి తీసుకెళ్లి ఎలా పరిష్కరిస్తారో చూడాలి….