కేసీఆర్ స‌ర్కారుకు ‘కుక్క‌ల’ సెగ‌!

తెలంగాణ‌లోని కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఒక‌వైపు. ప్ర‌తిప‌క్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. పాద‌యాత్ర‌లు.. విమ‌ర్శ‌లు.. స‌వాళ్ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. అయితే.. వీరికితోడు. ఇప్పుడు కుక్క‌ల‌ ఘ‌ట‌న కూడా స‌ర్కారును కుదిపేస్తోంది. హైద‌రాబాద్‌లోని అంబ‌ర్ పేట‌లో రెండు రోజుల కింద‌ట జ‌రిగిన వీధికుక్క‌ల ఘ‌ట‌న‌.. స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది.పైగా ఈ ఘ‌ట‌న‌ను హైకోర్టు సుమోటోగా తీసుకోవ‌డంతో మ‌రింత‌గా ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఎక్క‌డో ఏదైనా చిన్న ఘ‌ట‌న జ‌రిగితే.. మ‌న‌సు పెట్టి స్పందించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. అంబ‌ర్‌పేట లో వీధికుక్క‌లు ఒక చిన్నారిని చంపితినేసిన ఘ‌ట‌న‌పైనా స్పందించారు. అయితే..ఆయ‌న రియాక్ష‌న్ అనుకున్న విధంగా లేద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవడం.. క‌నీసం ప‌రామ‌ర్శించేందుకు ఎవ‌రినీ పంపించ‌క‌పోవ‌డంపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, ఈ ఘ‌ట‌న‌ను హైకోర్టు స్వ‌యంగా స్వీక‌రించి విచార‌ణ చేస్తామ‌ని చెప్ప‌డంపై వంద‌లాది మంది నెటిజ న్ల‌తోపాటు..సెల‌బ్రిటీలు కూడా స్వాగ‌తిస్తున్నారు. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అయితే.. ఏకంగా మేయ‌ర్‌ను ఆ కుక్క‌ల మ‌ధ్య వ‌దిలిపెడితే.. అప్పుడు బాధ తెలుస్తుంద‌ని అన్నారు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ విఫలమైందని విమర్శించారు.

‘శునకాలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి’ అని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై ఆర్జీవీ మండిపడ్డారు. ‘‘శునకాల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి నా ఆలోచన చెబుతా. నగరంలోని అన్ని శునకాలకూ ఈ వీడియో చూపిస్తే, ఆకలి వేసినప్పుడల్లా, చిన్నారులపై దాడి చేయకుండా మేయర్ఇంటికి వెళ్తాయి. అలాగే, ఆ హృదయ విదారక వీడియోను ఆమెకు తరచూ చూపించాలి. అప్పుడే ఆమె చెత్త సలహాలు ఇవ్వకుండా ఉంటారు. కిల్లర్‌ డాగ్స్‌కు ఆమె నిజమైన నాయకురాలేమోనని నాకు అనిపిస్తోంది“ అని ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు.

ఇక‌, నెటిజ‌న్లు కూడా తీవ్రంగానే స్పందించారు. మంత్రి కేటీఆర్‌, హైదరాబాద్‌ పోలీసులు దీనిపై విచారణ చేయాల‌ని కోరుతున్నారు. ఇంత జరిగినా జీహెచ్ ఎంసీ ఏమాత్రం బాధ్య‌త వ‌హించ‌డం లేద‌ని.. మ‌నుషు లంటే లెక్కేలేదా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, ఈ పరిణామాన్నిత‌మ‌కు రాజ‌కీయ అస్త్రంగా మార్చుకు నేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామ‌ర్శించేందుకు బీజేపీ పెద్ద‌లు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.