మంగ‌ళ‌గిరిలో గెలుపు ఎవ‌రిది… ఎవ‌రికి వారిదే ధీమా..!

గుంటూరు జిల్లాలో ఎక్క‌డ గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా.. ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం గెలిచి తీరాలి.. ఆ కిక్కే వేర‌ప్పా!! అంటున్నారు వైసీపీ, టీడీపీనాయ‌కులు. రెండుపార్టీల‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం చాలా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారా లోకేష్‌ను గెలిపించుకోవాల‌ని.. టీడీపీ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఇక్క‌డ చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇటీవ‌ల యువ గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించ‌డానికి ముందు వ‌ర‌కు కూడా నారా లోకేష్ నియోజ‌క‌వ‌ర్గంలో వారానికి రెండు సార్లు ప‌ర్య‌టించారు. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు.

అనేక మంది వీధి వ్యాపారుల‌కు సాయం కూడా అందించారు. ఇక‌, ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆప‌న్న హ‌స్తం కూడా అందిస్తున్నారు. పైగా త‌న కేడ‌ర్‌ను కూడా ఇక్క‌డ ఏర్పాటు చేసుకుని, కార్యాలయంలోనేకాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు నారా లోకేష్ ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇంటింటికీ తిరిగారు. అయితే.. ఇప్పుడు యువ‌గ‌ళం నేప‌థ్యంలో త‌న పార్టీ కీల‌క‌నాయ‌కుల‌ను ఇక్క‌డ దింపి.. ప్ర‌జ‌ల‌కు పార్టీకి మ‌ధ్య దూరం తెగిపోకుండా చూసుకుంటున్నారు. త‌ర‌చుగా.. ఇక్క‌డి ప‌రిస్థితినికూడా ఆయ‌న స‌మీక్షిస్తున్నారు.

మ‌రో వైపు చంద్ర‌బాబు కూడా మంగ‌ళ‌గిరిలో ఏం జ‌రుగుతున్నా తెలుసుకుంటున్నారు. పార్టీ నేత‌ల‌తో ఆయ‌న కూడా ట‌చ్‌లో ఉంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మిని జ‌యించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. దీంతో గుంటూరులో ఏ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా.. ఖ‌చ్చితంగా మంగ‌ళ‌గిరిలో మాత్రంవిజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది. మ‌రోవైపు.. వైసీపీ కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇక్క‌డ ఆ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు గెలుస్తారు? అనేది ప్ర‌ధానం కాదు.. నారా లోకేష్‌ను ఎలా ఓడించాల‌నేదే వైసీపీ వ్యూహంగా ఉంది.

వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి..గత ఎన్నిక‌ల్లో నారా లోకేష్‌ను ఓడించారు. మ‌రోసారి కూడా ఆయ నే ఇక్క‌డ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది. అయితే..ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితిని బ‌ట్టి.. అవ‌స‌ర‌మైతే.. ఆళ్ల‌ను మార్చే ప‌రిస్థితి కూడా ఉంద‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. “ఇక్క‌డ ఆళ్ల‌.. ఈళ్ల‌.. అని కాదు.. ఎవ‌రు పోటీ చేసినా.. నారా లోకేష్‌ను ఓడించ‌డ‌మే ధ్యేయం. దానికి ఎవ‌రు స‌రిపోతే వారికే టికెట్‌” అని కీల‌క నాయ‌కుడుఒక‌రు కామెంట్ చేయ‌డం.. గ‌మ‌నార్హం. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ ప‌ట్టుద‌ల‌తో ద‌క్కించుకోవాల‌ని అనుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మంగ‌ళ‌గిరి తొలిస్థానంలో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.