సీఎస్‌నే తిడతా.. నువ్వెంత?

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల దూకుడుకు అడ్డుకట్టే ఉండడం లేదు. అధికారులంటే వారికి లెక్కే ఉండడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చాలామంది దాసోహం అంటుండడంతో ప్రతి అధికారీ అలాగే ఉండాలని నేతలు కోరుకుంటున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్లతో వివాదాలు పెట్టుకోగా.. మరికొందు ఎమ్మెల్యేలు టోల్ గేట్ సిబ్బందిపైనా చేయిచేసుకున్న ఉదంతాలున్నాయి. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు దేవాదాయ శాఖకు చెందని ఓ అధికారిని తీవ్రంగా బెదిరించారు. తనతో పెట్టుకుంటే 33 జిల్లాలలో ఎక్కడ పనిచేసినా వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

‘ఇంకా 30 ఏళ్లు నేనే గెలిచి అధికారంలో ఉంటాను. వచ్చేసారి మంత్రి కూడా అవుతాను. నువ్వు 33 జిల్లాలలో ఎక్కడ పనిచేసినా వదిలిపెట్టను’ అంటూ దేవాదాయ శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారిపై ఆగ్రహించారు.

అంతేకాదు… చీఫ్ సెక్రటరీనే తిట్టగలను… నువ్వెంత అంటూ చెలరేగిపోయారు. నల్లమలలోని చెంచుపెంటల్లో శివరాత్రి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణం కార్యక్రమంలో గువ్వల బాలరాజు రెచ్చిపోయారు. అధికారిపై విరుచుకుపడ్డారు. మీడియా ప్రతినిధులు కొందరు దీన్ని కెమేరాలలో షూట్ చేస్తుండగా వారిపైనా ఆగ్రహించారు.

కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వివాదంలో గువ్వల బాలరాజు కూడా ఒకరు. ఆ ఘటన తరువాత కొద్దిరోజుల పాటు బాలరాజు కేసీఆర్ ఫాం హౌస్‌లోనే ఉంచారు. కానీ, కేసు రూపు మారుతుండడంతో కేసీఆర్ ఈ నలుగురు ఎమ్మెల్యేలను దూరం పెడుతున్నట్లు వినిపిస్తోంది.

ఫాం హౌస్ వ్యవహారం, ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం ప్రభావం ఎలా ఉంటుందో అర్థం కానందున వచ్చే ఎన్నికల్లో బాలరాజుకు టికెట్ రావడం అనుమానమేనని వినిపిస్తోంది. ఈ ఫ్రస్టేషన్లోనే బాలరాజు ఆగ్రహానికి లోనవుతున్నారని వినిపిస్తోంది.