కేసీఆర్ పులా? మేకా?

టైగర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాస్త బకరా కేసీఆర్ అవుతున్నారా?
అవుననే అంటున్నాయి ఇటీవల ఆయనకు తగులుతున్న ఎదురుదెబ్బలు. తన వ్యూహాలన్నీ చిత్తవుతుండడంతో కేసీఆర్ మానసికంగానూ బాగా అప్‌సెట్ అవుతున్నారని.. మోదీని ఎలాగైనా దెబ్బతీయాలని, ఎలాగైనా మోదీపై పైచేయి సాధించాలని.. అదంతా ప్రజల ముందు ప్రదర్శించుకోవాలని ఆరాటపడుతున్న ప్రతిసారీ అనుకోని రీతిలో బీజేపీ నుంచి ఊహించని దెబ్బ తగులుతోందని భావిస్తున్నట్లు బీఆర్ఎస్‌లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత నెలలో సికింద్రాబాద్ -విశాఖ వందేభారత్ రైలు ప్రారంభానికి నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తారని అనుకున్నారు. దీంతో అదే సమయంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటుచేసి దేశం దృష్టిని, నేషనల్ మీడియాను ఆకర్షించాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. 10 లక్షల మందితో భారీ బల ప్రదర్శన చేయాలని తలపెట్టారు. అయితే… కేసీఆర్ ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తరువాత మోదీ తన సభ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అర్థరహితంగా మారినప్పటికీ ఖమ్మం సభను తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వచ్చింది.

మళ్లీ దాదాపు నెల రోజుల్లోనే ఫిబ్రవరి 13న మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సికింద్రాబాద్ వస్తారని తెలిసింది. అంతకంటే ముందే కొత్త సెక్రటేరియట్ ప్రారంభించాలని భావించారు కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని ప్లాన్ చేశారు. కానీ, మళ్లీ ప్రధాని టూర్ వాయిదా పడింది. దీంతో… ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా వేశారు.

ఇది జరగడానికి కొద్దిరోజుల ముందు రిపబ్లిక్ డే సందర్భంగానూ కేసీఆర్ కొత్త వ్యూహం పన్నారు. రిపబ్లిక్ డే నిర్వహిస్తే గవర్నర్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో పరేడ్ స్కిప్ చేయబోయారు. కానీ, దీనిపై కేసు పడడం.. కోర్టు రిపబ్లిక్ డే నిర్వహించాలని చెప్పడంతో అప్పటికప్పుడు రాజ్ భవన్‌లోనే పరేడ్ ఏర్పాట్లు చేశారు.

ఇక బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా చేయాలనుకున్నారు. కానీ, గవర్నర్ అంతకంటే మరో అడుగు ముందుకేసి అసలు బడ్జెట్‌నే ఆమోదించలేదు. దీంతో బడ్జెట్ ఆమోదం కోసం ప్రభుత్వం కోర్టుకెక్కింది. గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదని కోర్టు ప్రశ్నించింది.. దీంతో అప్పుడు మళ్లీ ఒక మెట్టు దిగి గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పాల్సి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వం మెట్టు దిగడంతో గవర్నర్ కూడా బడ్జెట్‌కు ఆమోదం పలికారు. దీంతో…. తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీలో గవర్నర్ వెంట నడవాల్సి వచ్చింది.

ఇక వీటన్నటికంటే ముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో పాటు ఆధారాలన్నీ సీబీఐకే సమర్పించాల్సి రావడంతో ఇందులో కుట్ర కోణాలు బయటపడతాయేమోనని బీఆర్ఎస్‌లో బెంగ మొదలైంది.

ఇలా.. మోదీపై పైచేయి సాధిద్దామని… ఏదో చేద్దామని… తడాకా చూపిద్దామని కేసీఆర్ అనుకుంటున్న ప్రతిసారీ తానే బకరా అవుతున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. మరి.. కేసీఆర్ ఈ ఎదురుదెబ్బలన్నీ తట్టుకుంటూ ఏకంగా కుంభస్థలాన్నే కొడతారో లేదో చూడాలి.