గెలిపించేది కాపులేనంటున్న కన్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కాపుల ఓట్లతోనే గెలుస్తుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 22 శాతం కాపులున్నారని 1989 నుంచి వాళ్లే నిర్ణాయక శక్తిగా కొనసాగుతున్నారని కన్నా అంటున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాపు సామాజికవర్గాన్ని వాడుకునే రాజకీయ పార్టీలు తర్వాత వారిని వదిలేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

తొమ్మిదేళ్ల క్రితం పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన మాట నిజమేనన్నారు. కాపులను తాను ప్రభావితం చేయలేనని అంటూనే జనసేనను ఎవరూ బయట నుంచి ప్రభావితం చేయకుండా చూడాలన్నారు. జనసేనను ఎలా అధికారంలోకి తీసుకురావాలో పవన్ కల్యాణ్ కు నిర్ణయం వదిలేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణ, జనసేనలో చేరతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంచరించుకున్నాయి..

కాపు రిజర్వేషన్ అమలు కాకపోవడంపై కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ కోసం చాలా మంది పోరాటాలు చేశారని, తాను కూడా కోటా ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఓబీసి చట్ట సవరణ ఆధారంగా రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే చట్టబద్ధత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాపుల సంక్షేమానికి వైఎస్, చంద్రబాబు కృషి చేశారని ఆయన ఒప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కాపులను ఇకనైనా న్యాయం చేయాలని కన్నా విజ్ఞప్తి చేస్తున్నారు…