కేసీఆర్‌తో జ‌గ్గారెడ్డి భేటీ.. హీట్ పెంచేసిన పాలిటిక్స్‌

తెలంగాణ రాజ‌కీయాలు ఎప్పుడు ఎలాంటి మ‌లుపు తీసుకుంటున్నాయో.. చెప్ప‌డం క‌ష్టంగా ఉంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు ఉన్న అన్ని మార్గాల‌నూ కేసీఆర్ ఎంచుకుంటున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీ కూడా త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. ఇక‌, కాంగ్రెస్ కూడా త‌న దారిలో తాను ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. హాత్ సే హాత్ కార్య‌క్ర‌మం జోరుగా నిర్వ‌హిస్తోంది.

మ‌రి ఆయా పార్టీలు అలా ప్ర‌య‌త్నం చేస్తున్న స‌మ‌యంలో అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి చేసిన ప‌ని.. రాజ‌కీయంగా కాక రేపింది. తెలంగాణ అసెంబ్లీ హాల్‌లో సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఆయ‌న ఆఫీస్‌లోనే గ‌డిపారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రూ లేర‌ని.. జ‌గ్గారెడ్డి-కేసీఆర్ మాత్ర‌మే ప‌ర్స‌న‌ల్‌గా చ‌ర్చించుకున్నార‌ని తెలిసింది.

గ‌త కొన్నాళ్లుగా కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న జ‌గ్గారెడ్డి.. పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం ఉంది. అయితే.. దీనిని ఆయ‌న ఖండిస్తూ వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు.. ఏదైనా జ‌ర‌గొచ్చ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. దీనికి బ‌లం చేకూరుస్తున్న‌ట్టుగా జ‌గ్గారెడ్డి కేసీఆర్‌తో భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే..సీఎం కేసీఆర్‌తో భేటీ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. త‌న నియోజక అభివృద్ధి గురించే ఆయనను కలిసినట్లు చెప్పారు. ఇతర అంశాలపై ప్రగతి భవన్‌కు వచ్చి కలుస్తానని సీఎంతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ ఇత‌ర‌ అంశాలు ఏంట‌నేది మాత్రం ఆయ‌న వెల్ల‌డించ‌లేదు.

మ‌రోవైపు.. కేసీఆర్‌ను జగ్గారెడ్డి కలవడం కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది. అయితే సీఎంతో భేటీ వల్ల కొత్తగా వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన వారానికే తనను కోవర్టు అని కొందరు ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ మామూలే అని జ‌గ్గారెడ్డి లైట్ తీసుకున్నారు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.