ఏపీలో కరోనా ఉగ్రరూపం…ఒక్క రోజే దాదాపు 8 వేల కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తీరం దాటిన తుపానులా ఏపీపై కరోనా పంజా విసురుతోంది. గత రెండు రోజులుగా ఏపీలో 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజలు కలవరపడతున్నారు. తాజాగా, ఏపీలో రికార్డు స్థాయిలో 7998 పాజిటివ్ కేసులు నమోదవడం మరింత కలవరపెడుతోంది. అయితే, డిశ్చార్జిల విషయంలో ఏపీలో పురోగతి ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో 5,428 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 34,114 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 58,052 శాంపిల్స్ ను పరీక్షించగా….వాటిలో 7998 పాజిటివ్ వచ్చాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 69816కు చేరింది. ఏపీలోని 3 జిల్లాల్లో ఒకే రోజు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవడం విశేషం.

గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుంచి కోలుకుని 5248 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 34,818మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 61 మంది మృత్యువాతపడ్డారు. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, అనంతపురం జిల్లాలున్నాయి. తూర్పు గోదావరిలో 1391, గుంటూరులో 1184, అనంతపురంలో 1016 కేసులు, కర్నూలులో 904, విశాఖపట్నంలో 684, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 14 మంది, గుంటూరులో 7, కర్నూలులో 7, కృష్ణాలో 6, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, చిత్తూరులో 3, పశ్చిమగోదావరిలో 3, ప్రకాశంలో 3, కడపలో ఒక్కరు, అనంతపురం జిల్లాలో ఒకరు కరోనా బారినపడి చనిపోయారు. దీంతో, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 884కి పెరిగింది.