అమరావతిలో రాజధాని నిర్మిస్తాం: సోము వీర్రాజు

త్వరలో విశాఖకు రాజధాని తరలించేస్తున్నానని ఏపీ సీఎం జగన్ దిల్లీ కేంద్రంగా జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలోనే చెప్తుంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం తాము అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని నిర్మిస్తామని అంటున్నారు. కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజుకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే జగన్ ఏపీ రాజధానిని విశాఖకు తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వంలోని తమ పార్టీ పెద్దలను కలవాలి. కానీ, వీర్రాజు ఇంతవరకు ఒక్కసారి కూడా ఏపీ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ దిల్లీ పెద్దలపై ఒత్తిడి చేసిన పాపాన పోలేదు.

జగన్ కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో ఇల్లు కూడా సిద్ధం చేస్తున్నారని.. రాజధాని అక్కడికి తరలించేస్తున్నారని వైసీపీ అంతా కోడై కూస్తుంటే తాము అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతిలో కడతామని వీర్రాజు అంటున్నారు. ఏపీ సీఎం జగన్‌కు అత్యంత ఇష్టుడైన బీజేపీనేతగా ఆ పార్టీలో గుసగుసలాడుకునే వీర్రాజు వ్యాఖ్యలు విని సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. నిజంగా అమరావతిపై ఆయనకు ప్రేమ ఉంటే జగన్ ప్రయత్నాలు అడ్డుకునేందుకు ట్రై చేయాలి కదా అంటున్నారు.

వీర్రాజు కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ… గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ రాజధానిని నిర్మించలేదని ఆరోపించారు. మూడు రాజధానులని అంటున్న సీఎం జగన్ వాటికి కనీసం రూ.300 కూడా ఖర్చు చేయలేదని సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీలోని ఎమ్మెల్యేలు.. పరిపాలకులుగా కాకుండా కేవలం ట్రేడర్స్ గా వ్యవహరిస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయ పరిపాలన కొనసాగుతోందన్నారు. కుటుంబ పరిపాలనకు బీజేపీ దూరమని చెప్పారు. రాష్ట్రానికి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం గత నాలుగు సంవత్సరాలుగా 16 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. కేవలం ఎడ్యుకేషన్ లోనే 10 రత్నాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. 60 సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తోందని తెలిపారు. జగన్ కంటే మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రంలో అధికమని చెప్పారు. 2024 అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

అయితే, వీర్రాజు వ్యవహార శైలిపై ఆ పార్టీలోనే చాలాకాలంగా ఆరోపణలున్నాయి. పార్టీ వ్యవహారాల సంగతి పక్కన పెడితే వైసీపీకి, సీఎం జగన్‌కు వీర్రాజు అనుకూలంగా వ్యవహరిస్తారని.. ఏదైనా అంశం వచ్చినప్పుడు ప్రస్తుత ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేసి ఇప్పుడు అధికారంలో లేని గత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తారని అంటున్నారు.

తాజాగా రాజధాని విషయంలో కూడా చాతనైతే అమరావతే ఏకైక రాజధాని అని కేంద్రంతో చెప్పించే ప్రయత్నం చేయకుండా తాము అధికారంలోకి వస్తే నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమని అంటున్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడమనేది ఇప్పుడప్పుడే జరిగే విషయం కాదని తెలిసే వీర్రాజు ఇలాంటి అతి తెలివి కబుర్లు చెప్తున్నారని పార్టీలోని ఆయన వ్యతిరేకులు అంటున్నారు.