తెరపైకి మళ్లీ కాపు రిజర్వేషన్

కాపులకు రిజర్వేషన్‌ కల్పించే అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం సమయం ఉండటంతో ఇప్పుడది ఎన్నికల అంశంగా మారుతోంది. మాజీ మంత్రి, కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఏపీ హైకోర్టులో ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ వేశారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది.

ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు హయాంలో చట్టాలు చేశారు. జగన్ అధికారానికి రాగానే ఆ చట్టాలను రద్దు చేశారు. రెండు జీవోలతో ఆ రిజర్వేషన్ మొత్తాన్ని జగన్ సర్కారు నిలుపుదల చేసింది. దీనితో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయిన కాపు వర్గాలు తీవ్ర ఆందోళన, ఆవేదనకు లోనయ్యారు. కాపు, బలిజ, తెలగ వర్గాలు మళ్లీ వెనుకబాటు తనంలోకి వెళ్లిపోతాయన్న భయం వారిలో నెలకొంది.

జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల హరిరామ జోగయ్యను కలిశారు. అప్పుడు కాపు రిజర్వేషన్ అంశం, జగన్ చేసిన ద్రోహం చర్చకు వచ్చింది. కేవలం కక్షసాధింపుతో జగన్, కాపు రిజర్వేషన్‌ను ఆపేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ స్థానం ద్వారా రిజర్వేషన్‌ను సాధించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి చర్చల ఆధారంగానే కాపు వర్గాలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాయి. ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నిజానికి కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాల్లో చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు. వారికి తిండి కూడా దొరకడం లేదు. ఆ సంగతిని కోర్టులో నిరూపించగలిగితే, సరైనా గణాంకాలు సమర్థించగలిగితే అనుకూల తీర్పు వస్తుందని ఎదురుచూస్తున్నారు.