మ‌ళ్లీ మోడీనే.. ఈ స‌ర్వే ఏం చెప్పిందంటే!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భేష్ అంటూ.. ఇటీవ‌ల కాలంలో కొన్ని స‌ర్వేలు వ‌స్తున్నాయి. వాస్త‌వం ఎలా ఉన్నా.. ఈ స‌ర్వేలు మాత్రం సంచ‌ల‌నం రేపు తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఇలాంటి స‌ర్వేనే ఒక‌టి మోడీకి 78 శాతం ప్రజామోదం ఉందని పేర్కొంది. ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే సంస్థ ఈ స‌ర్వే చేసింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేత మోడీనేన‌ని పేర్కొంది. ఈ స‌ర్వేలో మొత్తం 22 మంది దేశాధినేతలపై ప్ర‌జ‌ల అభిప్రాయం కోరిన‌ట్టు సంస్థ తెలిపింది. వీరిలో మోడీ అత్యధిక రేటింగ్‌ సంపాదించుకున్నారని తెలిపింది.

వరుసగా రెండో ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోడీ నిలిచార‌ని మార్నింగ్ క‌న్స‌ల్ట్ సంస్థ పేర్కొంది. అమెరికాకు చెందిన ఈ సంస్థ గ్లోబల్ లీడర్‌ అప్రూవల్‌ పేరుతో దేశాల్లో నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీని 78శాతం మంది ప్రజలు ఆమోదించారని తెలిపింది. 68 శాతంతో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ రెండో స్థానంలో ఉన్నారని, అమెరికా అధినేత జోబైడెన్‌ ఈ సంవత్సరం ఒక స్థానం దిగజారి 40 శాతంతో ఏడో స్థానంలో నిలిచారని స‌ర్వే పేర్కొంది.

అదేవిధంగా నార్వే ప్రధాని జోనాస్‌ గహర్‌ 21 శాతంతో చిట్టచివరి స్థానంలో నిలిచారని మార్నింగ్ క‌న్స‌ల్ట్ సంస్థ తెలిపింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్ యుల్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వరుసగా 20, 21 స్థానాల్లో ఉన్నారు. ఇటలీ తొలి నూత‌న మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోని 52 శాతం ప్రజామోదంతో 6వ స్థానంలో నిలిచారు.

ఇక‌, ఈ స‌ర్వేలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో నిలవ‌గా, బ్రెజిల్‌కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా 50 శాతం ఆమోదంతో 5వ స్థానంలో, కెనడా ప్రధాని 40 శాతం ఆమోదంతో 9వ స్థానంలో, యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ప్రజామోదంతో 12వ స్థానాన్ని సంపాదించుకున్నారని.. స‌ర్వే స్ప‌ష్టం చేసింది. మొత్తం ప్ర‌జ‌ల్లో మోడీకి ఉన్న ఆద‌ర‌ణ బాగుంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.