ఒక్క ప్రెస్ మీట్.. అందరికి ఇచ్చి పడేసిన కోటంరెడ్డి

ఏపీ అధికార వైసీపీ నేతలకు.. విపక్ష వైసీపీ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు బోలెడన్ని విషయాలు చెబుతారు. వీటన్నింటిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే.. వైసీపీ చెందిన ప్రతి నేత ఒక్కో ఆటంబాంబ్ మాదిరి ఉంటారు. వైఎస్ జగన్ అంటే వల్లమాలిన అభిమానమే కాదు.. ఆయన తమ మంత్రి పదవుల్ని తీసేసినా సరే.. విధేయతతో ఉంటారు. ప్రైవేటు సంభాషణల్లో సైతం అధినేత గురించి మాట్లాడేందుకు సముఖత వ్యక్తం చేయరు.

గుండెల్లోని బాధను చాలా కొద్దిమంది ముందు మాత్రమే చెప్పుకుంటారు. మొత్తంగా విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండటమే కాదు.. అధినేత మీద ఈగ కాదు కదా ఈగ రెక్క మందంగా వెళుతున్నా ఇష్టపడకుండా ఉండే వైనం కనిపిస్తుంది. విపక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల్ని చూసినప్పుడు.. ఇలాంటి గుణాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తాయి. అదే చంద్రబాబుకు మైనస్ కాగా.. జగన్ కు అదే ప్లస్ అవుతుంటుంది.

అంతటి విధేయతను ప్రదర్శించే నేత మనసు విరిగినప్పుడు.. సదరు వైసీపీ నాయకుడు ఎలా మారతారు? వారి మాటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తారు వైసీపీ ఎమ్మెల్యే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కారణం ఏదైనా.. తన విషయంలో అధినేత జగన్ ప్రదర్శించిన వివక్ష.. చిన్నచూపుతో పాటు మరికొన్ని కారణాలు కలిసి ఆయన మనసు విరిగింది. టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారు.

ఇంతకాలం తమతో ఉండి.. ఇప్పుడు బయటకు వెళ్లే కోటంరెడ్డి మీద ఎప్పటిలానే వైసీపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టారు. దీంతో.. ఆయన తానేమిటో చూపిస్తున్నారు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన నేతలు.. చంద్రబాబును ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో పోలిస్తే.. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేందుకు సిద్ధమైన కోటంరెడ్డి లాంటి వారు అస్సలు మాటలే అనలేదని చెప్పాలి. అయినప్పటికీ వైసీపీ నేతల మాటల దాడితో మనసు మరింత విరిగిన కోటంరెడ్డి ఇప్పుడు మాటల ఊచకోతను మొదలు పెట్టారు.

వెనుకా ముందు చూసుకోకుండా.. తోపుల్లాలంటి వైసీపీ నేతలకు వరుస పెట్టి ఇచ్చి పడేస్తున్నారు. ఆయన మాటల ధాటి చూస్తుంటే.. ఈ తరహాలో విరుచుకుపడే సత్తా టీడీపీలో చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నట్లు అర్థమవుతుంది. గడిచిన మూడు రోజులుగా కోటంరెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనపై విమర్శలు సంధించేందుకు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటే.. తాజాగా మాట్లాడిన ఆయన ఒకే రౌండ్ లో చాలామందికి మాటలతో ఇచ్చి పడేశారు.

చంద్రబాబు ట్రాప్ లో పడిన కోటంరెడ్డి అవాస్తవాల్ని చెబుతున్నారని.. ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్. ఆయన ఒక్కరే కాదు ప్రభుత్వ సలహాదారు.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామక్రిష్ణారెడ్డి, మరో మాజీ మంత్రి అనిల్ యాదవ్ ల మీద విరుచుకుపడ్డారు. కోటంరెడ్డి తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యల్ని చూస్తే..

  • వైసీపీ నుంచి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో.. మౌనంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లాలని అనుకున్నా. కానీ, పార్టీకి చెందిన 13 మంది మంత్రులు.. సలహాదారులు.. ప్రాంతీయ కోఆర్ఢినేటర్లు నా వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా.
  • చంద్రబాబు ట్రాప్ లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నట్లుగా మంత్రి కాకాణి విమర్శిస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి వీర విధేయుడు కాడని.. వేరే వాళ్లకు విధేయుడని కాకాని అంటున్నారు. ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. నేను కష్టాల్లో నడిచిన వ్యక్తిని. ఎక్కడుంటే అక్కడ విధేయుడిగా ఉంటానే తప్పించి పక్కదారులు చూసే వ్యక్తిని కాదు.
  • అధికారపక్షం నుంచి ప్రతిపక్షంలోకి వద్దామనుకుంటే నమ్మక ద్రోహమా? మరి మిమ్మల్ని జడ్పీ ఛైర్మన్ ను చేసి రాజకీయ మెట్టు ఎక్కించిన ఆనంకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారు?
  • జగన్ ఓదార్పు యాత్రలో పొదలకూరులో వైఎస్ విగ్రహం పెట్టకుండా మీరు అడ్డుకోలేదా?వైఎస్ కుటుంబానికి వీర విధేయులే అయితే వైఎస్ విగ్రహాన్ని పెట్టేందుకు ఎందుకు అడ్డుకున్నారు కాకాణి?
  • విధేయత గురించి మీరు మాట్లాడుతుంటే నాకు జాలేస్తోంది. వైసీపీలో ఉండి చంద్రబాబు కాళ్లకుదండం పెట్టింది కాకాణి కాదా? నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసులో కాకాణిని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నా.
  • మంత్రి పదవి ఇప్పించిన సజ్జలను విమర్శిస్తే కాకాణికి కోపం వచ్చినట్లుంది. నాకు బెదిరింపు కాల్స్ వచ్చినా భయపడకుండా అంతా వింటున్నా. రికార్డు చేస్తున్నారని తెలిసినా మాట్లాడా. నేను భయపడలేదు.
  • నన్ను.. నా తమ్ముడ్ని కొట్టుకుంటూ తీసుకెళ్తామని ఎవరో కడప నుంచి అనిల్ అనే వ్యక్తితో ఫోన్ చేయించారు. సజ్జల కోటరీ నుంచే ఆ వ్యక్తి మాట్లాడినట్లు తెలిసింది. ఎవరో వ్యక్తితో మాట్లాడించిన సజ్జలకు నేను చెప్పేది ఒక్కటే. నాకు అలాంటి ఫోన్ కాల్స్ వస్తే.. మీకు నెల్లూరు రూరల్ నుంచి వీడియో కాల్స్ వస్తాయని సజ్జల గుర్తు పెట్టుకోవాలి.
  • నా మీద కిడ్నాప్ కేసు పెట్టారు. అవసరమైతే హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోండి. సలహాదారుగా ప్రభుత్వ పనులు ఆపేసి ఆపరేషన్ నెల్లూరు రూరల్ అన్నట్లుగా సజ్జల బిహేవ్ చేస్తున్నారు. ఫోన్లు చేయించి భయపెట్టాలనుకుంటే సహించేది లేదు.