లోకేష్ యువ‌గ‌ళానికి భారీ క్రేజ్‌… ఇది ఓట్లుగా మారితే…!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర కుప్పం నుంచి జ‌న‌వ‌రి 27న భారీ ప్ర‌జా మ‌ద్ద‌తుతో అడుగులు ముందుకు వేసింది. రోజు రోజుకు ఈయాత్ర‌కు మద్ద‌తు పెరుగుతోంది. మూడు రోజులు కుప్పంలోనే పాద‌యాత్ర చేసిన నారా లోకేష్ అనేక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారిసాధ‌క బాధ‌లు కూడా విన్నారు. కొన్ని న‌మోదు చేసుకున్నారు.

కొంద‌రికి అభ‌యం కూడా ఇచ్చారు. కుప్పంలో కూర‌గాయ‌ల మార్కెట్‌కు ప్ర‌త్యేకంగా స్థ‌లం కేటాయిస్తామని.. హామీ కూడా ఇచ్చారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉద్యోగాల క‌ల్ప‌న చేస్తామ‌ని.. ఉపాధికి ఊత‌మిస్తామ‌ని కూడా నారా లోకేష్ చెప్పారు. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా మ్యానిఫెస్టోను రూపొందిస్తామ‌ని కూడా ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ ప‌రిణామాలు.. ఆస‌క్తిగా మారాయి.

అదేస‌మ‌యంలో నారా లోకేష్‌కు.. భారీ ఎత్తున ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఆయ‌న వెంట క‌లిసి అడుగులు వేస్తున్నారు. ఎటు చూసినా.. పెద్ద ఎత్తున జ‌న సందోహం క‌నిపిస్తోంది. ఎటు విన్నా యువ‌గ‌ళం నినాదం వినిపిస్తోంది. జై లోకేష్ నానాదాలు కూడా మార్మోగుతున్నాయి. క‌ట్ చేస్తే.. ఈ యువ‌గ‌ళానికి సంబంధించి ఇంత భారీ మ‌ద్ద‌తు వ‌స్తుంద‌ని పార్టీ నాయ‌కులు కూడా ఊహించి ఉండ‌ర‌నే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే.. ఇంత పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరంతా ఓటు బ్యాంకుగా మార‌తారా? అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. కొన్ని లోటుపాట్లు పార్టీలోనే క‌నిపిస్తున్నాయి. దీంతో వాటిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, తొలిరోజే ఒక‌రిద్ద‌రు నాయ‌కులు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించారు.

పార్టీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టులు త‌ప్పుగా ఇస్తున్నార‌ని.. వాస్త‌వాల‌ను చెప్ప‌డం లేద‌ని వారు అన్నారు. మ‌రి వాటిని స‌రిదిద్దే కార్య‌క్ర‌మానికి .. నారా లోకేష్ ప్ర‌య‌త్నిస్తే బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఇలాంటి చేసి.. పార్టీని బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.