ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు: జ‌గ‌న్‌కు లోకేష్ ప్ర‌శ్న‌

ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతార‌ని.. సీఎం జ‌గ‌న్‌ను టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ప్ర‌శ్నించారు. మద్య నిషేధం చేసిన తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని నిల‌దీశారు. ఆఖరికి మందు బాబులను తాకట్టు పెట్టిన ఘన చరిత్ర జగన్ రెడ్డిదేన‌ని దుయ్య‌బ‌ట్టారు. జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు… ఇప్పుడు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర మూడో రోజు ఆదివారం కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని శాంతి పురంలో కొన‌సాగింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యారు. వారి స‌మస్య‌లు తెలుసుకున్నారు. విన‌తి ప‌త్రాలు స్వీక‌రించారు. ఆయనకు మహిళలు తిలకం దిద్ది హారతి పట్టారు. ఆ తర్వాత స్థానిక మహిళలతో లోకేశ్‌ భేటీ కాగా.. మూడున్నరేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు. పొదుపు సంఘాలను నిర్వీర్యం చేయటంతో స్వయం ఆర్థికాభివృద్ధి కూడా కుంటుపడిందని డ్వాక్రా మహిళలు తెలిపారు. గత ఎన్నికల్లో ఒక్క అవకాశం మాట నమ్మి చారిత్రక తప్పిదం చేశామని మహిళలు వాపోయారు.

అనంత‌రం శాంతిపురం జంక్ష‌న్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో నారా లోకేష్‌ మాట్లాడుతూ.. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. మహిళల తాళిబొట్లను కూడా తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక ధరలపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. పన్నుల భారం తగ్గిస్తేనే నిత్యావసర ధరలు తగ్గుతాయని.. దీనిపై సమీక్షించి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని లోకేష్‌ స్పష్టం చేశారు. మద్యం సీసా తయారీ నుంచీ మద్యం తయారీ, అమ్మకం వరకు అంతా జగన్ రెడ్డి బినామీలే ఉన్నార‌ని ఆరోపించారు.

మ‌హిళ‌ల‌పై ప్ర‌త్యేక పాఠం!

టీడీపీ అధికారం వచ్చిన తరువాత విద్యార్థి దశ నుంచే మహిళల గొప్పతనం, త్యాగాలు, కష్టాలు తెలిసే విధంగా ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతామని, మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఈ ప్ర‌భుత్వం చేసింది ఏమీ లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌నీసం అమ్మ ఒడి నిధులు కూడా స‌రిగా ఇవ్వ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. అనేక సాకులు చెప్పి అమ్మ ఒడిలో డబ్బులు కట్ చేసి ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.