ఏపీ పై తెలంగాణ మంత్రి ల‌వ్‌!

అదేం చిత్ర‌మో కానీ.. కొన్నాళ్ల కింద‌ట‌.. ఏపీ వేరు మేం వేరు.. అక్క‌డ ప్ర‌జ‌లు ఏమైతే మాకెందుకు.. అని.. వ్యాఖ్యానించిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. తాజాగా టంగ్ మార్చారు. ఒక రాష్ట్రంగా ఉన్న ప్రాంతాలు రెండు రాష్ట్రాలు అయ్యాయి.. అంతే! రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌న‌సులు క‌లిసే ఉన్నాయి.. అంటూ.. తాజాగా ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో గ‌త విష‌యాలు గుర్తున్న‌వారు.. హ‌న‌న్నా.. శ్రీనన్నా.. అంటూ ముక్కున వేలేసుకున్నారు.

ఏపీ విష‌యంలో ఆది నుంచి కూడా తెలంగాణ నాయ‌కులు దూకుడుగానే ఉన్నారు. సాగ‌ర్ నుంచి బ‌ల‌వం తంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేసినా.. క‌రోనా స‌మ‌యంలో ఏపీ అంబులెన్సుల‌ను అడ్డుకున్నా.. స‌మ‌ర్ధించుకు న్న తెలంగాణ మంత్రులు.. తాజాగా ఏపీ విష‌యంలో మాట మార్చేశారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఉద్యోగుల కార్య‌క్ర‌మంలోపాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. ఆశ్చ‌ర్య‌క‌రంగా మాట్లాడారు.

“ఉమ్మడి రాష్ట్రంలో కలిసే పని చేశాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. భౌగోళికంగా విడిపోయినా, ఇప్పటికీ మా మనసులు కలిసే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. రెండురాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌న‌సులు ఒకటేన‌ని వ్యాఖ్యానించారు. స‌మ‌స్య‌ల‌ను సానుకూలంగా ప‌రిష్క‌రించుకునే విధానాల‌పై దృష్టి పెడుతున్నామ‌ని చెప్పారు.

కానీ, గ‌తంలో ఇదే మంత్రి మాత్రం ఫైర్ అయ్యారు. అయితే.. ఇప్పుడు ఇంత మార్పున‌కు కూడా బీఆర్ ఎస్ కార‌ణ‌మ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో బీఆర్ ఎస్ అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో మంత్రి ప‌ర్య‌ట‌న‌.. ఆయ‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మ‌రి మున్ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాలో అంటున్నారు ఏపీ రాజ‌కీయ ప‌రిశీల‌కులు.