మోదీ తెలంగాణ నుంచి పోటీయా? అసలు 2024లో పోటీ చేస్తారా?

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఆయన మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే… ఇదంతా బీఆర్ఎస్‌ను భయపెట్టడానికి తెలంగాణ బీజేపీ చేస్తున్న హడావుడే కానీ దిల్లీలో అలాంటి సూచనలే కనిపించలేదంటున్నారు బీజేపీకే చెందిన మరికొందరు నేతలు. అంతేకాదు… అసలు 2024 ఎన్నికల్లో మోదీ పోటీ చేస్తారో లేదో కూడా ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు.

నిజానికి ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే చర్చ గతంలోనూ జరిగింది. 2022 సెప్టెంబర్ 17తో ప్రధాని మోదీకి 72 ఏళ్లు నిండాయి.. 2024లో కనుక ఎన్నికలు వస్తే ఆయనకు అప్పటికి 73 నిండి 74 ఏళ్లు నడుస్తుంటాయి. బీజేపీలో కొద్దికాలంగా అలిఖిత నిబంధన ఒకటి పాటిస్తున్నారు. అదేమిటంటే… 75 ఏళ్లు నిండిన నేతలు పదవులకు దూరంగా ఉండడం.

2024లో బీజేపీ గెలిచి మళ్లీ మోదీ ప్రధాని అయితే 2025 సెప్టెంబరులో 75 ఏళ్లు పూర్తయిన తరువాత ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి రావొచ్చు. పార్టీ పదవులు, కేబినెట్లో మంత్రి పదవుల విషయంలో అనేకమంది నేతలు 75 ఏళ్లు నిండిన తరువాత దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతెందుకు కర్ణాటక సీఎంగా పనిచేసిన యెడ్యూరప్ప కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి రావడానికి వయసే కారణమైందని బీజేపీలో వినిపిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ కూడా 75 ఏళ్ల వయసు నిబంధనలకు కట్టుబడి ఉంటారని భావిస్తున్నారు. అదే జరిగితే ఆయన ముందుగానే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే మాట ఒకటి బీజేపీలో వినిపిస్తోంది.

ఇక తెలంగాణలోని మహబూబ్‌నగర్ పార్లమెంటు సీటు విషయానికొస్తే అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది. పైగా మోదీ పోటీ చేస్తారంటే బీఆర్ఎస్ ఎలాగైనా ఓడించాలనే ప్రయత్నం చేస్తుంది. మోదీ కూడా ఓటమిని అంగీకరించే నేత కాదు. కాబట్టి బీజేపీ కూడా ఎలాగైనా గెలవాలనకుంటుంది. కానీ… ఇంతవరకు బీజేపీ అక్కడ ఏమీ గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన దాఖలాలు కానీ.. మోదీ పోటీ చేస్తే ఉండాల్సిన ముందస్తు కసరత్తులు కానీ లేవు. వారణాసిలో మోదీ తొలిసారి పోటీ చేయడానికి ముందు నుంచే అక్కడ బీజేపీ టీంలు రంగంలోకి దిగి విపరీతంగా పనిచేశాయి. కానీ, పాలమూరులో అలాంటి కదలికలే లేవు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికిది ఊహాగానంగానే అనిపిస్తోంది. ముందుముందు బీజేపీ వేసే అడుగులు బట్టే ఇది నిజమో కాదో తెలియనుంది.