నాలుగేళ్ల పిల్లాడి తో నాటకాలా రాహుల్?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయనకు అనుకున్నంత ప్రచారం రాకపోయినా జాకీలు పెట్టి లేపే పని పెట్టుకున్నారు కొందరు. వణికించే చలిలోనూ మా నాయకుడు కేవలం టీ షర్టు వేసుకుని పాదయాత్ర చేస్తున్నారంటూ ఈమధ్య ఊదరగొట్టారు. అంతవరకు బాగానే ఉంది. అదంతా రాహుల్ వ్యక్తిగత ఇష్టం, కష్టం.. ఏమైనా అనుకోవచ్చు. కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించిన మరో ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఆయన నాలుగేళ్ల పిల్లాడి చేయి పట్టుకుని నడవడం కనిపిస్తుంది. ఆ పిల్లాడు చంద్రశేఖర్ అజాద్ వేషధారణలో ఉన్నాడు. అక్కడే వచ్చింది తంటా అంతా.. వేషధారణపై ఎవరికీ అభ్యంతరం లేదు కానీ వేషధారణలో భాగంగా పిల్లాడు ఒంటి మీద చొక్కా లేకుండా ఉన్నాడు.

ఉత్తర భారతదేశంలో.. అందులోనూ ఇప్పడు రాహుల్ యాత్ర సాగుతున్న ప్రాంతమంతా ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పడిపోయాయి. అంటే పెద్దవాళ్లు వణికే చలి. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఒంటి మీద చొక్కాలేకుండా చిన్న పిల్లాడిని పొద్దునే నడిపించడం ఆయన ఆరోగ్యంతో చెలగాటమాడడమేనన్న విమర్శలు వస్తున్నాయి.

పైగా ఆ ఫొటోలో ఉన్నవారిలో యువకులు సైతం దళసరి జాకెట్లు, స్వెటర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లతో కనిపిస్తున్నారు. అలాంటిది చిన్నపిల్లాడిని ఆచ్ఛాదన లేకుండా చలి నుంచి రక్షణ లేకుండా ఎముకలు కొరికే చలితో తిప్పడం తప్పేనంటున్నారు అందరూ.

ఇక బీజేపీ నేతలపైతే ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో రచ్చ ప్రారంభించారు. రాహుల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తారంటున్నారు. బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా ఈ ఫోటోను బగ్గా ట్వీట్ చేస్తూ.. ‘4 డిగ్రీల ఉష్ణోగ్రతలో సిగ్గులేని వ్యక్తి మాత్రమే రాజకీయాల కోసం బిడ్డను బట్టలు లేకుండా తిరిగేలా చేయగలడు’ అని రాశారు.

బీజేపీ నేతలు, ఐటీ వింగ్ ఈ ఫొటోను విపరీతంగా సర్క్యులేట్ చేస్తోంది. అయితే.. కాంగ్రెస్ నేతలు బీజేపీ విమర్శలను తిప్పికొడుతూ ఆ పిల్లాడి తల్లిదండ్రుల అనుమతితోనే యాత్రలో పాల్గొన్నాడని.. స్వచ్ఛందంగానే అలా వచ్చాడని చెప్తున్నారు.