‘గుడ్‌మార్నింగ్’ చెప్పావని గుడ్డిగా ఓట్లేస్తారా కేతిరెడ్డీ?

‘మెరిసేదంతా బంగారం కాదు’ అనే సామెత రాజకీయాల్లో చాలామంది పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కూడా ఇది కరెక్టుగా సరిపోతుందట. పొద్దున్న లేవగానే ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ అంటూ కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు నుంచి దిగి రెండు మూడు గంటల పాటు కేతిరెడ్డి చేసే హడావుడిని ఫేస్‌బుక్ లైవ్‌లో వేలమంది చూస్తుంటారు. ధర్మవరం నియోజకవర్గానికి చెందని లక్షలాది మంది కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బీభత్సమైన ఫ్యాన్స్‌గా మారిపోయారు. అయితే… ధర్మవరంలో మాత్రం పరిస్థితి వేరట. కేతిరెడ్డి తన గుడ్‌మార్నింగ్ కార్యక్రమంలో స్వీకరించిన ప్రజాసమస్యలలో పరిష్కారమవుతున్నవి చాలా తక్కువ అని… ఆయన షో చేస్తారే కానీ ప్రజలకు పనికొచ్చే పనులేవీ చేయరని ధర్మవరంలో టాక్.

నిజానికి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనకంటూ బలమైన ఇమేజ్ నిర్మించుకోవడానికి గుడ్‌మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఆయన పార్టీ పరిస్థితి ఎలా మారినా తన ఇమేజ్ మాత్రం స్థిరపడిపోవాలనే లక్ష్యంతో దీన్ని ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక టీంను నియమించుకుని మీడియా హౌస్‌లు కూడా ఆశ్చర్యపోయేలా చిన్న ఇబ్బంది కూడా లేని లైవ్‌ ఇస్తూ షో నడిపిస్తున్నారు. పైగా.. రెండు మూడు గంటలు సాగే ఈ కార్యక్రమంలో ఆయన చిన్నపిల్లలను, ఆడవాళ్లను, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ భుజాలమీద చేయి వేస్తూ వారిలో ఒకడిలా మాట్లాడుతూ సాగుతుంటారు.

ఏరా చిన్నా బడికి పోలేదా అంటారు… అక్కా పథకాలు సక్కగ అందుతున్నాయా అని అడుగుతారు.. పెద్దాయనా పింఛను డబ్బులు అంతా తాగేస్తున్నావా, దాచుకుంటున్నావా అంటూ సరదాగా అడుగుతుంటారు. ఒక్కోసారి ఏదో ఒక స్కూలు దగ్గరకు వెళ్లి అక్కడ తోపుడు బళ్ల మీద ఉండే చాక్లెట్లు, బిస్కట్లు, చిప్స్ పాకెట్లు అన్నీ 10 వేలో 15 వేలో ఇచ్చి బండి బండంతా టోకుగా కొనేసి.. ఏకంగా ఆ బండిని స్కూళ్లోకి తీసుకెళ్లి పిల్లలందరికీ పంచేస్తుంటారు. ఇలాంటి షో‌తో ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి ఫేస్‌బుక్‌లో, మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

అయితే… ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. ఈ షో చూసి ముచ్చటపడేవారంతా, అభిమానించేవారంతా ధర్మవరానికి చెందినవారు కాదని… ఎక్కడెక్కడో ఉంటూ ఫేస్ బుక్‌లో ఉండేవారు ఇదంతా చూసి సరదాపడుతుంటారు కానీ ధర్మవరం ప్రజలు మాత్రం కేతిరెడ్డిపై మోజును వదులుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆయన ఎంత కాదంటున్నా పదేపదే వస్తున్న భూకబ్జా ఆరోపణలు ఆయన్ను వెంటాడుతున్నాయి. పైగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఆయన లైఫ్ స్టైల్ అల్ట్రా రిచ్‌గా ఉంటుంది. కోట్ల రూపాయలు విలువ చేసే టాప్ లెస్ కారులో వస్తారు.. కారు ఆపిన తరువాత లైవ్ కోసం మైక్ అన్నీ ఏర్పాటుచేసుకున్నాక అనుచరులు డోర్ తీస్తే దిగి వడివడిగా నడుచుకుంటూ ముందుకు సాగుతుంటారు.

ఇక ధర్మవరంలో ఆయన ఇల్లు, ఫాంహౌస్‌లలో పదుల సంఖ్యలో అరేబియా గుర్రాలను కొని పెట్టారని.. ఒక్కో గుర్రం ధర 25 లక్షల నుంచి 50 లక్షలు ఉంటుందని చెప్తారు. ప్రపంచంలోని విలాసవంతమైన బ్రాండ్ల కార్లన్నీ కేతిరెడ్డి కొన్నారన్నది ఆయన ప్రత్యర్థుల ఆరోపణ. ధర్మవరంలో చెరువు ఆక్రమించుకుని 100 ఎకరాలలో ఫాంహౌస్ కట్టారని అంటున్నారు ఆయన ప్రత్యర్థులు.

ఇవన్నీ జగన్ వరకు చేరడంతో కొద్దినెలల కిందట పిలిచి క్లాస్ కూడా పీకారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మార్నింగ్ వాక్‌లు చేస్తే చాలదు.. గడపగడపకు వైసీపీ కార్యక్రమం కరెక్టుగా చేయాలంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు. అంతేకాదు… రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్లు పోగొట్టుకునే సిటింగ్ ఎమ్మెల్యేల పేర్లలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ముందు వరుసలో ఉన్నారట. అదీ సంగతి.