చంద్ర‌బాబువి.. ఫొటో షూట్-డ్రోన్ షాట్ రాజ‌కీయాలు: జ‌గ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. చంద్ర‌బాబు రాజ‌కీయాలు కేవ‌లం .. ఫొటో షూట్‌-డ్రోన్ షాట్ పాలిటిక్స్ అని విమ‌ర్శ‌లు గుప్పించారు. బాబు చేసేవి శ‌వ‌రాజ‌కీయాలేన‌ని దుయ్య‌బ‌ట్టారు. గ‌తంలో ఎన్టీ రామారావును అడ్డుపెట్టుకుని శవరాజకీయాలు చేశార‌ని మండిప‌డ్డారు. రాజ‌మండ్రిలో పెరిగిన పింఛ‌ను 2750 పంపిణీ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై రుస‌రుస‌లాడారు.

‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది చంద్ర‌బాబే. ఎన్నికలప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఫొటోలకు, విగ్ర‌హాల‌కు దండ‌లేసి.. దండం పెట్టి ఓట్లు అడుక్కుంటాడు. చంపేది.. మొసలి కన్నీరు కార్చేది కూడా చంద్ర‌బాబేన‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబుకు తెలిసింది వెన్నుపోటు పొడవడం, ఫొటోషూట్‌, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం.. మాత్రమే అని ఎద్దేవా చేశారు.

రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో ఫొటో షూట్‌, డ్రోన్ షాట్ల కోసం.. 29 మందిని బలి తీసుకున్నార‌ని విమ‌ర్శించారు. నెల్లూరు జిల్లా కందుకూరు సభలో జనం తక్కువ వస్తే.. ఎక్కువ వచ్చారని చూపించేందుకు రోడ్డు మీద ఒక సందులో జనాలను నెట్టి ర్యాలీ నిర్వహించి, ఎనిమిది మందిని బలిగొన్నార‌ని విమ‌ర్శించారు. జ‌నాల‌ను చంపేసి మానవతావాదిలా చంద్రబాబు డ్రామాలు ఆడతార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

ఇన్ని జ‌రుగుతున్నా.. చంద్ర‌బాబు దత్తపుత్రుడు ఏనాడూ నిలదీయడు అంటూ ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాంటి పెద్ద మనిషిని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నాయని సీఎం జగన్ విమ‌ర్శించారు. అలాంటివేం తనకు లేకున్నా.. తనకు ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో జాగ్రత్తగా ఆలోచించండి.. లేక‌పోతే.. నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లేనని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.