ఎవ‌రా సిట్టింగులు? ఏంటా క‌థ‌? కేసీఆర్ వ్యూహమేంటి?

ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ.. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఏపీలో సిట్టింగు ఎమ్మెల్యేలు అంటే.. మెజారిటీగా ఉన్న‌ది వైసీపీలోనే. బ‌హుశ వీరిని కార్న‌ర్ చేస్తూనే కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌నేది రాజ‌కీయ వ‌ర్గాల అనుమానం. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగానే పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం.

గ‌త కొన్నాళ్లుగా ఏపీలోవైసీపీ ఎమ్మెల్యేల‌ను ప‌రిశీలిస్తే.. దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదేస‌మ‌యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌రికిమించి అభ్య‌ర్థులు సైతం రంగంలో ఉన్నారు. సిట్టింగుల కంటే ఎక్కువ‌గా వారు అధిష్టానం ద‌గ్గ‌ర లాబీయింగ్ చేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ద‌ర్శి నియోజ‌వ‌ర్గంలో సిట్టింగ్ మ‌ద్దిశెట్టి వేణు గోపాల్కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కే ఛాన్స్ లేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదే స‌మ‌యంలో 2019లో త‌న‌కు టికెట్ వ‌ద్దే వ‌ద్ద‌న్న రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఇప్పుడు పోటీకి సై అంటున్నారు. అధిష్టానం ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి ఉంది.. దీంతో ఈయ‌న‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ త‌న‌కు టికెట్ ద‌క్క‌ద‌నే అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. పైగా..త‌న‌ను ప‌రుచూరుకు వెళ్ల‌మ‌ని చెప్ప‌డం కూడా ఆయ‌న జీర్ణించుకోలేక పోతున్నారు. న‌ర‌స‌రావు పేట మాజీ ఎంపీ, గుంటూరు ఎంపీగా గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికూ డా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఎందుకంటే.. ఈయ‌న‌కు ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు నుంచి వేరేవారిని రంగంలోకి దింపేందుకు పార్టీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ ప‌రిణామాలతో చాలా మంది నాయ‌కులు వైసీపీపై ఆగ్ర‌హంతోనే ఉన్నారు. బ‌హుశ వీరంతా కూడా బీఆర్ఎస్‌కు జై కొట్టే అవ‌కాశం ఉంద‌ని కేసీఆర్ భావిస్తుండ‌వ‌చ్చు. వీరిలో చాలా మంది జ‌న‌సేన‌పై ఇష్టం ఉన్నా.. ఆ పార్టీకి స‌రైన పునాదులు ప‌డ‌లేద‌ని, టీడీపీతో పొత్తుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని భావిస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌తో త‌మ‌కు ప్ర‌యోజ‌నం లేద‌ని భావిస్తున్న‌వారంతా.. ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తారా? చూడ‌రా.. అనే చ‌ర్చ‌ జ‌రుగుతుండ‌గానే.. కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రి వీరంతా బీఆర్ ఎస్‌లో చేరితే.. రెడ్డి సామాజిక వ‌ర్గం వైసీపీకి దూర‌మ‌వుతుంద‌నే చెప్పాలి. ఇలా జ‌రిగేందుకు జ‌గ‌న్ ఒప్పుకోరు. కాబ‌ట్టి.. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అనేది చూడాలి. ఏదేమైనా కేసీఆర్ మాత్రం చాలా వ్యూహాత్మ‌కంగానే కామెంట్లు చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.