ఎందుకీ చిక్కుముళ్లు.. తేల్చేస్తే.. పోలా బాబూ..!

టీడీపీ అధినేత Chandrababu రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌నలో ఇంకా తెగువ క‌నిపించ‌డం లేదు. ఇంకా సాచివేత‌, సాగ‌దీత ధోర‌ణుల‌కే ఆయ‌న మొగ్గు చూపుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కుల‌ను ప‌ట్టుకుని ఆయ‌న వేలాడుతున్నారో.. నాయ‌కులు ఆయ‌న‌ను ప‌ట్టుకుని వేలాడోలో.. తెలియ‌ని ఒక సంక‌ట స్థితిలో టీడీపీ నేడు జారిపోయింది.

గ‌తంలో అన్న‌గారు NTR పార్టీని డీల్ చేశారు. ఒక ద‌శ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం.. అంద‌రూ ఆయ‌న‌పై ఉద్య‌మానికి దిగారు. మాకు క‌నీసం ప్రాధాన్యం ఇవ్వరా? అని ప్ర‌శ్నించారు. వీరిలో అప్ప‌టి మాధ‌వ‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే.. ఎన్టీఆర్ వెనుక‌డుగు వేయ‌లేదు. “ఔను.. మీకు ప్రాధాన్యం ఇచ్చేలా మీరు ఉండ‌డం లేదు. మీరు కాంగ్రెస్‌కు కోవ‌ర్టులుగా ప‌నిచేస్తున్నారు. ఇది నేను స‌హించ‌ను. ముందు మీరు మారండి. లేదా మార్పును ఆహ్వానించండి!” అని ముక్కుమీద గుద్దిన‌ట్టుచెప్పారు.

ఈ క్ర‌మంలోనే ప‌బ్బ‌తిరెడ్డి జ‌నార్ద‌న్ వంటి వారు టీడీపీకి దూర‌మ‌య్యారు. అయినా ఎన్టీఆర్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. అధికారం పోతుంద‌ని కానీ, ప్ర‌తిప‌క్షంలో కూర్చోవాల్సి వ‌స్తుంద‌ని కానీ, అనుకోలేదు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. అధికారం తెచ్చుకున్నారు. వైసీపీని తీసుకున్నా.. ఇదే ప‌రిస్థితి. అనేక మంది జ‌గ‌న‌ను వ్య‌తిరేకించారు. మైసూరా రెడ్డి వంటివారు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. Jagan తాను తీసుకున్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డ్డారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. వారి ఓట్లు పోతాయేమో.. వీరిని బుజ్జ‌గించాలేమో..అని అనుకోలేదు. ప్ర‌జ‌ల‌ను బుజ్జ‌గిస్తే.. చాల‌ని అనుకున్నారు అదే చేశారు. కానీ, టీడీపీ ప‌రిస్థితి ఇప్పుడు అలా అదేని అంటున్నారు.

ఎక్క‌డికక్క‌డ బాబును ఆడించేవారే క‌నిపిస్తున్నారు త‌ప్ప‌.. బాబును మెరుగు ప‌రిచేందుకు పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లేందుకు.. చాలా మంది ప్ర‌య‌త్నించ‌డం లేదు. మ‌రి వీరిని ఎందుకు కొన‌సాగిస్తున్నారు? తాడోపేడో ఏదో ఒక‌టి తేలిపోతుంది.. 2019 క‌న్నా న‌ష్టం ఇంక జ‌ర‌గ‌దు. అయినా.. బాబు తెగించ‌లేక‌పోవ‌డం.. పార్టీకే శాపంగా మారింది.