ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి.. తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు షాకింగ్ డెసిష‌న్ తీసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును CBIకి అప్ప‌గిస్తూ.. సంచ‌న‌ల తీర్పు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు దాఖలు పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.

సిట్‌ దర్యాప్తు సరిగా జరగలేదని BJP తరఫున న్యాయవాది రామచందర్‌రావు ఆరోపించారు. కేసులో సాంకేతిక అంశాలను పట్టించుకోలేదన్నారు. రాజకీయంగా వేధిస్తున్నారని కోర్టుకు వివరించినట్లు తెలిపారు. సంబంధం లేకున్నా.. బీజేపీ పేరు ప్రస్తావించారని తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు పెట్టారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేశారని.. అవినీతి నిరోధ‌క శాఖ‌కు తప్ప సిట్‌కు విచారణ అధికారం లేదు అని రామచందర్‌రావు తెలిపారు. ఈ వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది.

ఏం జ‌రిగింది.?

అధికార TRS ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నించ‌డం.. మునుగోడు ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను తెలంగాణ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అనేది పోలీసుల అభియోగం.

హుటాహుటిన సిట్‌

ఎమ్మెల్యే కొనుగోలు కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. కీలక కేసుల్లో సిట్‌ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం రాష్ట్రంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తొలిసారి. అయితే.. దీనిని హైకోర్టు తాజాగా ర‌ద్దు చేసి.. సీబీఐకి కేసును అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం.