యువత తిరగబడింది… రాజ్యం ఉలికిపడింది!

నిజమే… యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం నిజంగానే మోదీ సర్కారు ఉలికిపాటును చాటి చెప్పింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో దేశ యువత చేపట్టిన ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో దేశ యువత తీవ్ర ఆగ్రహావేశాల్లో ఊగిపోతున్న తరుణంలో ఎంతో బలంగా కనిపించిన ఎన్డీఏ సర్కారు తలొంచక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

గతంలో ఓ సారి… తాజాగా 2026 నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేసిన రీఎగ్జామ్ నిర్వహించినా కూడా జనంలో ఆగ్రహం అయితే తగ్గలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని దేశ యువత డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ నుంచే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందని చెప్పాలి. అభిజిత్ దీప్కే నేతృత్వంలో ఎంట్రీ ఇచ్చిన కాక్రోచ్ పార్టీ… ధర్మేంద్ర రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి తెర తీసింది. ఈ ఉద్యమానికి పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ కూడా జత కలిశారు.

ఓ వైపు కాక్రోచ్ పార్టీ, మరోవైపు వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్షతో దేశ యువత మేల్కొంది. తప్పు జరిగినా.. దానిని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేని ఎన్డీఏ సర్కారు పొగరును అణచివేయాల్సిందేనని యువత ఓ గట్టి నిర్ణయాన్నే తీసుకుంది. ఈ క్రమంలోనే కాక్రోచ్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రోజుల తరబడి నిరసనలు హోరెత్తాయి. ఈ నిరసనలను అణచివేయాలని ఎన్డీఏ సర్కారు పోలీసు బలగాలను మోహరించింది. అక్కడే ఆమరణ దీక్ష చేస్తున్న వాంగ్ చుక్ ను బలవంతంగా దీక్ష విరమించేలా చేసింది. ఇక కాక్రోచ్ పార్టీ ఆంధోళనలను కూడా నిర్వీర్యం చేసే దిశగా నరేంద్ర మోదీ సర్కారు వ్యూహాత్మకంగా సాగింది.

ఈ క్రమంలోనే తప్పు జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం… అందుకు బాధ్యులుగా ఎన్టీఏ అధికారులను బదిలీ చేసి అంతటితోనే పని పూర్తి అయినట్టు తేల్చి చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయబోరంటూ తేల్చేసింది. ఈ విషయంపై ఓ వైపు చర్చలు జరుగుతుండగానే… దేశం నలుమూలల నుంచి విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి పయనమైంది. చూస్తుండగానే… జంతర్ మంతర్ ఓ యువ సునామీగా మారిపోయింది. అంతేకాకుండా దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్లెక్కారు. నిరసనలతో హోరెత్తించారు. 

అంతకంతకూ పెరిగిపోతున్న నిరసనల హొరును చూశాక ఎన్డీఏ సర్కారుకు ముచ్చెమటలు పట్టేశాయని చెప్పాలి. అప్పటిదాకా ఈ నిరసనలపైనా, నీట్ పేపర్ లీక్ పైనా పెద్దగా స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అర్థరాత్రి వేళ సెల్ఫీ వీడియోలతో స్పందించక తప్పలేదు. వరుసగా రెండు వీడియోలు మోదీ నుంచి విడుదలైన నేపథ్యంలో నిరసనలు తగ్గుతాయని కేంద్రం భావించింది. అయితే అందుకు విరుద్ధంగా ధర్మేంద్ర రాజీనామా తప్పించి తమకు ఏ చర్య కూడా తమను ఆపలేవని యువత తేల్చి చెప్పింది. ఆ మేరకు జంతర్ మంతర్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాలు నిరసనలతో హోరెత్తాయి. వీటిని చూసిన తర్వాత కేంద్రం దిగిరాక తప్పలేదు. ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.