కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కూడా ఢిల్లీకి పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో ఫడ్నవీస్‌కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

మరోవైపు, ఫడ్నవీస్ కేంద్ర మంత్రివర్గంలో చేరితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో మార్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండేను మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

ఈ పరిణామాలపై శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని, మహారాష్ట్రలో సీఎం మార్పు దాదాపు ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై బీజేపీ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, నేతల వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.