న‌న్ను ఓడించే మొగాడు పుట్ట‌లేదు: కొడాలి

kodali

వైసీపీ పైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి కొడాలి నాని.. అదే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా కూడా టీడీపీపై విరుచుకుప‌డుతున్నారు. తాను గుడివాడ‌లో ఉన్నంత వ‌ర‌కు త‌న‌ను ఓడించే నాయ‌కుడు లేడ‌ని అన్నారు. అంతేకాదు.. త‌న‌ను ఓడించే మొగాడు కూడా పుట్ట‌లేదని తాజాగా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం .. గుడివాడ‌లో జ‌రిగిన ర‌చ్చ‌పై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

గుడివాడ ఓటర్లు త‌న‌ భవిష్యత్తుని నిర్దేశిస్తారని నాని చెప్పారు. వైసీపీ ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి లేద‌న్నారు. వైసీపీ నాయ‌కులు ఎవ‌రి బూట్లూ నాకే అవ‌స‌రం,.. అవ‌కాశం కూడా లేద‌ని చెప్పారు. “దటీజ్ వైఎస్సార్సీపీ.. దటీజ్ జగన్.” అని కొడాలి వ్యాఖ్యానించారు. “ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేస్తున్నాం. మీకు ఇష్టం అయితే ఓట్లేయండి.. లేకుంటే పీకి పక్కనేయండి” అని జగన్ చెబుతున్నారని కొడాలి వ్యాఖ్యానించారు.

రంగా పై కామెంట్లు..

దివంగ‌త వంగావీటి రంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని కొడాలి నాని అన్నారు. గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామ‌ని చెప్పారు. ‘తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వంగావీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపింది. వంగవీటి రంగా చావుకు టీడీపీనే కారణం. రంగాను రాజకీయంగా ఎదుర్కొలేకే చంపేశారు. రంగా పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్థితి టీడీపీది’ అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

రంగా చావుకు కారణమైన వ్యక్తులు కూడా ఈ రోజు ఆయన బూట్లు నాకుతున్నారంటూ.. టీడీపీ నేత‌ల‌పై నోరు చేసుకున్నారు. రంగా హత్య కేసులో ముద్దాయిలు టీడీపీలోనే ఉన్నారని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు. “రంగా హత్య కేసులో దేవినేని ఉమ, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలు. నేను టీడీపీలో ఉన్నప్పుడు రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్‌ పీకాడు. ఇప్పుడు అదే టీడీపీ ఆయన కోసం పాకులాడుతోంది” అని కొడాలి చెప్పారు.