‘నిరూపించండి.. తిరిగి ఇచ్చేస్తా’

భూ ఆక్ర‌మ‌ణ‌ల ఆరోప‌ణ‌లు, కొనుగోలు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం.. సంచ‌ల‌న‌ స‌వాల్ చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ‘ఇట్టినా’ కంపెనీ నుంచి తాను కొనుగోలు చేసిన భూముల్లో రైతులవి ఎవరివైనా ఉంటే.. నిరూపించాల‌ని స‌వాల్ రువ్వారు. అంతేకాదు.. అలా నిరూపించిన వాటిని మార్కెట్‌ ధర ప్రకారం రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని.. జయరాం ప్రకటించారు. ఆస్పరిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన మంత్రిని.. ఇట్టినా కంపెనీకి భూములు ఇచ్చిన రైతులు, సీపీఎం నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు.

అనంతరం అంబేడ్కర్ సర్కిల్‌లో జగన్‌ జన్మదినోత్సవాల్లో పాల్గొన్న జయరాం.. రైతులకు భూముల రిజిస్ట్రేషన్‌ ప్రతిపాదన చేశారు. అయితే, జయరాం కొన్న భూములను ఆదాయపు పన్నుశాఖ అటాచ్ చేసిందని, ఆ భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పడం ఏంటని సీపీఎం నేతలు ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “నేను కొన్న వాటిలో ఇట్టినా కంపెనీ భూములుంటే తిరిగిచ్చేస్తా. మార్కెట్ విలువ ప్రకారం తిరిగి ఇచ్చేస్తా. భూములు అమ్మిన రైతులు మా ఇంటికి రండి. అమ్మిన రైతుల పేరిటే భూములు రిజిస్ట్రేషన్ చేయిస్తా. భూములు అమ్మిన రైతులు విపక్షాల దగ్గరకు వెళ్లొద్దు” గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు.

అస‌లు ఏం జ‌రిగింది?

కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలో 674/E, 729, 666/2, 668/C, 669/C, 713/A సర్వే నంబర్లలోని 30.83 ఎకరాల భూమి..2020 మార్చి 2న మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుక పేరుతో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అదేరోజు ఇతర కుటుంబసభ్యులు, బంధువుల పేరుతోనూ 180 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రేణుకమ్మ ఎలాంటి ఆదాయ వనరులు చూపించకపోగా..రూ.52.42 లక్షలతో ఎలా కొనుగోలు చేశారన్నది ఐటీ శాఖ ప్ర‌శ్న‌.

ఈ భూములను మంత్రి జయరాం కొని, తన భార్యతోపాటు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారని గుర్తించిన ఐటీ అధికారులు.. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్‌ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన ‘ఇట్టినా ప్లాంటేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కొన్నేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని చిన్నహోతూరు, పెద్దహోతూరు, ఆస్పరి పరిసర రైతుల నుంచి 454.37 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఈ కంపెనీ డైరెక్టరు మనుకు చిన్నాన్న వరసైన మంజునాథ్‌ పలువురికి ఆ భూముల్లో కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారు. అలా కొనుగోలు చేసిన వారిలో మంత్రి కుటుంబసభ్యులూ ఉన్నారు.