పన్నెండో తేదీ వచ్చినా జీతాల్లేవేంటి జగన్?

తమ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల గురించి అదే పనిగా ప్రచారం చేసుకోవటంలో ముందుంటారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజానికి ఆయనే కాదు.. జగన్ పరివారం మొత్తం కూడా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్ని హైలెట్ చేసుకుంటూ చెప్పుకోవటంతో పాటు.. తమ అధినాయకుడు కమ్ సీఎం బటన్ నొక్కేసి లబ్థిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బుల్ని పంపించే విధానం గురించి చెబుతూ మురిసిపోతుంటారు.

ప్రభుత్వం బడుగు.. బలహీన వర్గాల కోసం.. ఆర్థికంగా వెనకబాటుతనంతో ఉన్న వారిని ఆదుకునేందుకు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ.. వారికి చెల్లించాల్సిన డబ్బుల్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో వేయటం ద్వారా అవినీతికి చెక్ పెట్టే వీలుంది.

కానీ.. ఏపీలో వచ్చిన సమస్య ఏమంటే.. సంక్షేమ పథకాల కోసం వేలాది కోట్లను చిరునవ్వులు చిందిస్తూ.. ప్రముఖ మీడియా సంస్థల మొదటి పేజీల్లో యాడ్లు ఇచ్చే ప్రభుత్వానికి భిన్నంగా నెల మొత్తం జీతం కోసం పని చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చే విషయంలో రోజుల తరబడి వెయిట్ చేయించే తీరు ఏ మాత్రం సరికాదంటున్నారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగిముఖంలో చిరునవ్వు ఎప్పుడైతే కనిపిస్తుందో.. అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాడన్న మాట చెప్పిన జగన్.. తీరా తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు పదో తారీఖు దాటిన తర్వాత కూడా జీతాలు పడని పరిస్థితి దేనికి నిదర్శనం? అన్న మాట ఇప్పుడు ప్రశ్నగా మారింది.

సంక్షేమ పథకాల కోసం బటన్ నొక్కి లబ్థిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేయించే జగన్.. తమకు సైతం బటన్ నొక్కి జీతాలు పడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వ ఉద్యోగులు మాట అంటే.. అలాంటి పోలికలు వద్దని చెప్పేస్తున్నారు జగన్ పరివారం. ఇక.. మంత్రి బొత్స లాంటి వాళ్లు అయితే ఒక అడుగు ముందుకేసి మరింత ఇబ్బందికర స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

ఉద్యోగ సంఘాల వారు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు.. రాస్తారోకోలు చేసే కన్నా.. సమస్య పరిష్కారానికి కూర్చోని మాట్లాడుకోవటం.. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలనన వ్యాఖ్య చేయటం చూస్తే.. ఆయన గారి మైండ్ సెట్ ఏ రీతిలో ఉంటుందన్నది ఇట్టే అర్థమవుతుంది. జీతాల కోసం ఎవరైనా ఆందోళన చేస్తే నోటీసులు ఇస్తున్నారని.. కొన్ని సందర్భాల్లో బెదిరింపులు సైతం వస్తున్నాయని చెబుతున్నారు.

ఇదంతా ఓకే కానీ.. అసలు జీతాలు ఎందుకు టైంకి పడటం లేదన్న ప్రశ్నకు వస్తున్న సమాధానం.. ఉన్న డబ్బులన్నిసంక్షేమ పథకాల పేరుతో అయిపోవటం.. జీతాలు ఇచ్చేందుకు నిధుల వేట సాగటం.. సర్దుబాట్లు చేసుకొని జీతాలు వేసేసరికి క్యాలెండర్లో రోజులు కరిగిపోతున్నట్లుగా తెలుస్తోంది. నెలంతా పని చేసి.. చివరకు రావాల్సిన జీతం ఎప్పుడో కానీ రావటంతో ఏపీ ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావంటున్నారు. సంక్షేమ పథకాల్ని ఎలా అయితే ఠంచన్ గా బటన్ నొక్కేస్తారో.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల విషయంలోనూ అంతే బటన్ నొక్కుడు పక్కాగా బాగుంటుంది కదా సీఎంగారు అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. వారి మాట సీఎం వరకు వెళుతుందంటారా?