ఈ నినాదాలకు ‘టాప్ రేటింగ్‌’.. ఎందుకంటే!

ఏపీ ఎన్నిక‌ల ట్రెండ్‌ను మార్చిన పార్టీ వైసీపీ. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఒక్క ఛాన్స్ అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన వైసీపీ భారీ ఎత్తున ప్ర‌యోజ‌నం పొందింది. ఏకంగా 151 సీట్లను కైవ‌సం చేసుకుంది. అదే స‌మ‌యంలో రావాలి జ‌గ‌న్‌-కావాలి జ‌గ‌న్ వంటి స్లోగ‌న్ ప్ర‌జ‌ల్లోకి జోరుగా చేరింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకును జ‌గ‌న్‌కు చేరువ‌చేసింది. ఇక‌, టీడీపీ వ్య‌తిరేక వ్యక్తుల‌కు బైబై బాబు నినాదం.. రామ మంత్రంగా మారిపోయింది.

ఫ‌లితంగా వైసీపీకి ఇలాంటి నినాదాలు ప్ర‌ధాన అస్త్రాలుగా మారి గెలుపును అందించాయి. ఇక‌, ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టిపెట్టిన వైసీపీ.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనిలో భాగంగా కీల‌క‌మైన నినాదాల‌పై దృష్టి పెట్టింది. నాయ‌కుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంప‌డంతోపాటు.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న వైసీపీ.. ఇప్పుడు మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల నోళ్ల‌లో నానే నినాదాల‌ను రెడీ చేస్తోంది.

దీనిలో భాగంగా.. ‘వైనాట్‌’ అనే నినాదాన్ని ప్ర‌చారం చేస్తోంది. ఇటీవ‌ల జ‌గ‌న్ ఈ నినాదాన్ని అధికారికంగా నాయ‌కుల‌కు నూరిపోశారు. ‘వైనాట్ 175’ అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. దీంతో ఇప్పుడు చాలా జిల్లాల్లో ఎటు చూసినా ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ‘వైనాట్ 175’ అనే నినాద‌మే క‌నిపిస్తోంది. ఇది ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అయితే, ఇక‌, వైసీపీకి తిరుగులేద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. కానీ వైనాట్ 175 అనేది వాస్తవానికి దూరంగా ఉండటంతో అది జనంలోకి పోయే అవకాశం చాలా తక్కువ.

దీని ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ విజ‌యం ద‌క్కించుకోవాల‌నేది వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే వైనాట్ 175 వ్యూహానికి ప‌దును పెడుతున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌చార పాట‌ను కూడా రూపొందిస్తార‌ని అంటున్నారు. ఎలా చూసుకున్నప్ప‌టికీ.. ఈ నినాదాల‌కు టాప్ రేటింగ్ వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, టీడీపీ కూడా బాదుడే బాదుడు, ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి.. నినాదాలతో కార్య‌క్ర‌మాలు రూపొందిస్తోంది. వీటికి కూడా మంచి మార్కులు, రేటింగ్ వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. 

నిజానికి బాదుడే బాదుడు గత ఏడాది జగన్ చేసిన నినాదమే. కానీ దానితోనే జగన్ ని టార్గెట్ చేయడంలో తెలుగుదేశం సక్సెస్ అయ్యింది. అదిపుడు ఏపీ అంతటా వైరల్ అవుతోంది.