బాబే క‌నిపిస్తారు.. చూడండి!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న టీడీపీ.. ఆదిశ‌గా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇది ఆశించ‌ద‌గిన ప‌రిణామ‌మే. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం.. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాలపై టీడీపీ పోరాటాలు చేస్తోంది. అయితే, ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. చంద్ర‌బాబు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు.. ఆయ‌న‌ను మాత్ర‌మే జ‌నాలు చూస్తున్నారు!

ఇది మంచికా.. చెడుకా.. అనే చ‌ర్చ‌ను ప‌క్క‌న పెడితే.. పార్టీలో చంద్ర‌బాబు ఒక్క‌రే బ‌య‌ట‌కు రావ‌డం.. ఆయ‌న ఎన్నిసార్లు చెబుతున్నా.. పార్టీలో నాయ‌కులు ముందుకు రాలేకపోవ‌డం వంటివి మాత్రం చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చంద్ర‌బాబే చెప్పిన‌ట్టు.. మెజారిటీ నాయ‌కులు మీడియా మైకుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. ‘అక్క‌డి వ‌ర‌కు చాలు’ అనే పంథాను ఎంచుకుంటున్నారు.

త‌ద్వారా.. చంద్ర‌బాబు ఘోష ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి చంద్రబాబు ఇప్ప‌టి నుంచి ప్ర‌తి ఒక్క‌రూ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండాల‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వారిని ఉత్తేజం చేసేందుకు బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇక‌, ఇప్పుడు ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి అనే కార్య‌క్ర‌మాన్ని కూడా చేప‌ట్టారు. అయితే.. ఈ రెండు కార్య‌క్ర‌మాల‌ను పార్టీ సీరియ‌స్‌గా తీసు కుంద‌ని చెప్పినా.. సిన్సియ‌ర్‌గా తీసుకున్న వాళ్లు మాత్రం వేళ్ల‌మీదే క‌నిపిస్తున్నారు.

చంద్ర‌బాబు ఉంటే ఒక‌లా.. లేక‌పోతే మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్న నాయ‌కులు పెరుగుతున్నారు అనే రోజుల నుంచి అంద‌రూ అలానే ఉన్నార‌ని చెప్పే ప‌రిస్థితికి పార్టీ జారి పోయింది. తాజాగా చంద్ర‌బాబు రెండు రోజులు ఢిల్లీకి వెళ్లారు. జీ20 స‌ద‌స్సు అఖిల ప‌క్ష స‌మావేశంలో పాల్గొన్నారు. ఇక‌, అంతే.. రాష్ట్రంలో త‌మ్ముళ్లు స‌ర్దుకున్నారు. ఎవ‌రూ క‌నిపించ‌లేదు. వారి మాట వినిపించ‌లేదు. ఇదేం ఖ‌ర్మ ఎటు పోయిందో వారికి కూడా తెలియ‌దు. సో.. ఈ పరిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. బాబు మాత్ర‌మే క‌నిపిస్తారు.. చూడండి! అని కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితిని మార్చేందుకు బాబు ఏం చేస్తారో చూడాలి.