బాబాయిని చంపినంత సులువుగా న‌న్ను చంప‌లేవు జ‌గ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. త‌న‌ను చంప‌డం, త‌న త‌న‌యుడు, పార్టీ నాయ‌కుడు నారాలోకేష్‌ను హ‌త్య చేయ‌డం.. సీఎం జ‌గ‌న్ బాబాయి వివేకానంద‌రెడ్డిని బాత్ రూంలో హ‌త్య చేసినంత ఈజీకాద‌ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి త‌మ్ముడు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు విజ‌య‌రాయి అనే ప్రాంతంలో ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్యంగా తాజాగా సుప్రీంకోర్టు వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌ను వేరే రాష్ట్రానికి(తెలంగాణ‌) బ‌దిలీ చేయ‌డాన్ని ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు దీనిపై సీఎం జ‌గ‌న్ ఏం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. త‌న పోలీసుల‌పైనా.. త‌న పాల‌న‌పైనా న‌మ్మ‌కం లేక‌నే సుప్రీం కోర్టు ఈ కేసును పొరుగు రాష్ట్రానికి బ‌దిలీ చేసింద‌ని.. సో.. ఆయ‌న విశ్వాసాన్ని కోల్పోయార‌ని.. కాబ‌ట్టి సీఎంగా త‌న ప‌ద‌వికి రాజీనామ చేయాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఏలే అర్హ‌త జ‌గ‌న్‌కు లేద‌న్నారు.

జ‌గ‌న్ ఇదే లాస్ట్ ఛాన్స్ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కాగా, చంద్ర‌బాబు బహిరంగ సభకు జనం వేలాదిగా త‌ర‌లివ‌చ్చారు. వారిని చూసిన ఆనందంలో చంద్ర‌బాబు వారి ప‌ట్ల హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు త‌న సొంత బాబాయిని చంపి.. దానిని ఎన్నిక‌ల్లో సింప‌తీగా జ‌గ‌న్ వినియోగించుకున్నార‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌జ‌లు దీనిని ఇప్ప‌టికైనా అర్ధం చేసుకోవాల‌ని బాబు పిలుపునిచ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి జ‌గ‌న్ కు ఓటేస్తే.. రాష్ట్రానికి రాజ‌ధాని అమ‌రావ‌తి ఉండ‌ద‌ని బాబు చెప్పారు. “వివేకానంద‌రెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు హైద‌రాబాద్‌కు బదిలీ చేసింది. ఇది సీఎం జ‌గ‌న్‌కు చెంపదెబ్బ. దీనిపై జగన్ సమాధానం చెప్పాలి. ఏమాత్రం బాధ్య‌త ఉన్నా.. సీఎం సీటును వ‌దిలి పులివెందుల పారిపోవాలి. అసలు జగన్కి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌ను చంద్ర‌బాబు అభినందించారు.