నిజాలు బ‌య‌ట‌కు రావ‌డం అంత ఈజీ కాదు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు తాజాగా హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు బ‌దిలీ చేసింది. దీంతో ఏదో జ‌రిగిపోతుంద ని.. ఖ‌చ్చితంగా నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అనుకోవ‌డం స‌హ‌జ‌మే. దీనిని ఎవ‌రూకాద‌న‌రు. కానీ, ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కుజ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కోర్టు మారుతున్నా.. స‌వాళ్లు మార‌డం.. నిజాలు బ‌య‌ట‌కు రావ‌డం అంత ఈజీకాద‌ని అంటున్నారు న్యాయ‌నిపుణులు.

దీనికి మ‌రో ఉదాహ‌ర‌ణ కూడా చెబుతున్నారు. ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న జ‌గ‌న్‌కు సంబంధించిన ఆస్తుల (అక్ర‌మం అని విప‌క్షాలు అంటాయి) కేసులు ఇదే నాంప‌ల్లి కోర్టులో ఏళ్ల త‌ర‌బ‌డి విచార‌ణ‌లో ఉన్నాయి. కానీ, ఏమైంది? అనేది న్యాయ‌నిపుణుల ప్ర‌శ్న‌. ఇక‌, వివేకా కేసులో స‌వాళ్ల‌ను చూసినా.. అదే ప‌రిస్థితి త‌ల‌పిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఆ చిత్ర విచిత్రాలు.. అలుపెరుగ‌ని మ‌లుపులు, స‌వాళ్లు ఇప్పుడు చూద్దాం..

స‌వాల్ – 1
సొంత చిన్నాన్న వివేకా హత్య కేసు దర్యాప్తునకు సహకరించాల్సిన ప్రభుత్వం, పోలీసులే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఏకంగా సీబీఐ దర్యాప్తు అధికారిపైనే కేసులు నమోదు చేయడంతో ఒకానొక దశలో దర్యాప్తు నిలిపివేసి అధికారులు రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప‌రిస్థితి మారుతుందా? చూడాలి!

స‌వాల్ – 2
వివేకా కేసులో సీబీఐకి ఎవరైనా సాక్షులు వాంగ్మూలం ఇస్తే వారిని కొంద‌రు బెదిరించారు. సీబీఐ అధికారులు తమను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారంటూ వారితోనే ఎదురు కేసులు పెట్టించారు. మ‌రి ఈ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చేనా? ఎందుకంటే.. హైద‌రాబాద్‌కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇచ్చినా.. వారు మ‌ళ్లీ క‌డ‌ప‌లోనే తిర‌గాలి.. ఇక్క‌డే పెర‌గాలి!!

స‌వాల్ – 3
వివేకా హత్య సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సస్పెండ్ కాగా….ఆయన 2021 సెప్టెంబర్ 28 సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్‌ ఎదుట చెప్పాలంటూ వారు సీబీఐ కోరగా నిరాకరించారు. ఆ తర్వాత వారం రోజులకే సీఐ సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. మ‌రి ఇప్పుడు ఆయ‌న‌తో నిజం చెప్పించ‌గ‌లరా? ఎందుకంటే.. ఆయ‌న ఏపీలోని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే మ‌రో కొన్నేళ్లు ప‌నిచేయాలి. ఆయ‌న ఏకంగా.. డీఎస్పీ పోస్టుపై క‌న్నేశారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇప్పిస్తామ‌ని హామీ కూడా ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

స‌వాల్ – 4
వివేకా కేసులో కీల‌క‌మైన ఎంపీ, సీఎం జ‌గ‌న్‌కు సోద‌రుడు వ‌రుస అయ్యే క‌డ‌ప పార్ల‌మెంటు స‌భ్యుడు అవినాశ్‌రెడ్డి పేరు వచ్చినప్పటి నుంచి సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను ఎంపీనే కోర్టు హాల్లోనే అడ్డుకున్నారు. తన అనుచరుడు శివశంకర్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశావని ప్రశ్నించారు. కడప ఎంపీ సీటు విషయంలోనే అవినాశ్‌కు, వివేకాకు మధ్య విభేదాలు తలెత్తడంతో…అవినాశ్‌ తన అనుచరుడు శివశంకర్‌రెడ్డితో చంపించి ఉంటారని అనుమానాలు ఉన్నాయంటూ సీబీఐ తన ఛార్జిషీటులో తెలిపింది. మ‌రి ఈయ‌న సంగ‌తేంటి?

స‌వాల్ – 5
ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరు 3న చనిపోయాడు. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం జరిగిందో ఇప్పటికీ నిగ్గుతేల్చలేదు . హత్యానేరాన్ని తనపై వేసుకుంటే 10 కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చారంటూ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి, తర్వాత మాట మార్చిన గంగాధర్‌రెడ్డి ఈ ఏడాది జూన్‌ 9న చనిపోయారు. దానిపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సైతం తన ప్రాణాలకు ముప్పు ఉందని పదేపదే పోలీసులను వేడుకుంటున్నాడు. మ‌రి ఇవ‌న్నీ..సీబీఐ ఎలా ఛేదిస్తుంది? కోర్టు మారినా.. క‌డ‌ప మార‌దు.. అనే మాటే వినిపిస్తోంది.