షర్మిల ఏకు కాదు మేకే..

అండర్ డాగ్స్ తో పెను ప్రమాదమే పొంచి ఉంటుంది. ఎందుకంటే.. వారి మీద పెద్ద అంచనాల ఉండవు. ఒత్తిళ్లు ఉండవు. ఏమైనా చేయొచ్చు. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. అందుకే అంచనాలు లేని వారంతా అప్పుడప్పుడు చెలరేగిపోతుంటారు. రాజకీయాల్లోనూ ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి సీనే తెలంగాణలో నెలకొని ఉందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తెలంగాణతోనూ.. తెలంగాణ భావోద్వేగంతోనూ పెద్దగా లింకు లేని.. సింక్ కాని వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు పెద్దగా పట్టించుకున్నది లేదు.

ఆమె శక్తిసామర్థ్యాల మీదా పెద్దగా అంచనాలు లేవు. ఇదే షర్మిలకు లాభించిందని చెప్పాలి. అలా అని.. ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలతో షర్మిల ఏదో సాధిస్తుందన్న పెద్ద మాటల్ని మేం చెప్పటం లేదు. కాకుంటే.. మిగిలిన వారి మాదిరి షర్మిలను తేలిగ్గా.. సింఫుల్ గా తేల్చేసే వ్యక్తి ఎంతమాత్రం కాదన్న విషయం తాజాగా తన చేతలతో చూపించిందని చెప్పాలి.
పార్టీ పెట్టిన కొద్ది రోజులకే పాదయాత్ర పేరుతో తెలంగాణ మొత్తం ఆమె తిరగటమే కాదు.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న అవగాహనను పెంచుకుంటున్నారు. అంతేకాదు.. క్షేత్ర స్థాయిలో రోజుల తరబడి తిరగటం వల్ల.. ఎక్కడ? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యల వెనుకున్న కారణం ఏమిటి? కేసీఆర్ పాలన ఎలా సాగుతోంది? అవినీతి మరీ ఇంత భారీగానా? అన్న ప్రశ్నలకు తన పాదయాత్ర సందర్భంగా సమాధానాలు చెబుతున్నారు షర్మిల.

సోమవారం నాటికి ఆమె మొదలు పెట్టిన నడక 3500కి.మీ. చేరుకోవాల్సి ఉంది. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె ప్రయాణం తాత్కాలికంగా ఆగింది. అంతే తప్పించి ఆమె ఆగేది లేదన్న విషయం మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేశాయి. అన్నింటికి మించి టీఆర్ఎస్ కు చెందిన వారు తన వాహనం మీద దాడి చేసి.. ధ్వంసం చేస్తే.. ఆ డ్యామేజ్ అయిన కారును స్వయంగా నడుపుకుంటూ వచ్చి ప్రగతిభవన్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించటం ఒక ఎత్తు అయితే.. ధ్వంసమైన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరిన తీరు చూస్తే.. షర్మిల ఎంత మొండిది? మరెంత పంతంతో ఉన్న మహిళ అన్నది అర్థమవుతుంది.

ఇంతకాలం షర్మిలను పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్ నేతలు తాజా పరిణామాలతో ఆమెనుసీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ మొత్తంలో మరే రాజకీయ పార్టీ సైతం తమ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా విమర్శిస్తూ.. వారి అవినీతిపై చేసిన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. ఇదంతా చూస్తున్న గులాబీ పార్టీకి చెందిన పలువురు షర్మిలను ఏకుగా భావిస్తే తప్పు అవుతుందని.. ఆమె మేకుగా మారుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్న మాట గులాబీ తోటలోని గులాబీవాదుల నోట వినిపిస్తోంది.

అంతేకాదు.. ఇంతకాలం షర్మిలను పెద్దగా లెక్కలోకి వేసుకోకుండా ఉండటం ఒక తప్పు అయితే.. ఇప్పుడు ఆమె మీద ప్రతాపం చూపించే క్రమంలో బ్యాలెన్సు మిస్ కావటం కూడా తప్పే అవుతుందని చెబుతున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలు.. రాజకీయ అధినేతలను డీల్ చేసినట్లుగా షర్మిలతో వ్యవహరించటం తప్పే అవుతుందని చెప్పాలి. వైఎస్ గుణాలు ఎక్కువగా షర్మిలలోనే కనిపిస్తాయని.. వారి కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు చెబుతుంటారు. ఈ లెక్కన షర్మిలను పెద్దగా పట్టించుకోకపోవటం ప్రమాదకర పరిణామంగా రూపుదిద్దుకునే వీలుందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనను టీఆర్ఎస్ కు చెందిన పలువురు కొట్టిపారేస్తుంటే.. తక్కువమంది మాత్రం ఆమెను డీల్ చేసే తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. ఈ విషయాన్ని గులాబీ బాస్ గుర్తించారా? అన్నది ప్రశ్న.