బాబు టూర్‌.. సెల‌వులో త‌మ్ముళ్లు..

కొన్ని కొన్ని విష‌యాలు చిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీలోనూ ఇలాంటి ఘ‌ట‌న లే జ‌రుగుతున్నాయి. పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేయాల‌ని.. దీనికి సంబంధించిన గ్రౌండ్‌ను ప‌టిష్టం చేసుకునేందుకు చాలానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ఎండ‌న‌క వాన‌న‌క తిరుగుతున్నారు.. అన్న‌ట్టుగా ఆయ‌న అలానే తిరుగుతున్నారు. 40 ఏళ్లు వ‌చ్చాయంటే.. గంట సేపు నిల‌బ‌డేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డిపోతున్నారు నేటి యువ‌కులు.

అలాంటిది 70 ఏళ్ల వ‌య‌సులో నాలుగు గంట‌ల పాటు నిర్వ‌హిస్తున్న రోడ్ షో, స‌భ‌ల్లో చంద్ర‌బాబు నిలువు కాళ్ల‌ పై నిల‌బ‌డి.. ముందుకు సాగుతున్నారంటే.. ఆయ‌న ప్ర‌యాస ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇది సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతున్న తీరుగా పార్టీ నాయ‌కుల‌కు పెద్ద‌గా అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఆయ‌న ఉభ‌య గోదావ‌రి జిల్లాల టూర్ పెట్టుకున్నారు. రెండు రోజుల పాటు ఆయ‌న ఈ జిల్లాల్లో ప‌ర్య‌టించి.. ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి కార్య‌క్ర‌మానికి కొబ్బ‌రికాయ కొట్ట‌నున్నారు.

ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై స‌మ‌ర శంఖం పూరిస్తున్నారు. అయితే, ఈ రెండు జిల్లాల్లోని కీల‌క నాయ‌కులు ఐదుగురు(పేర్లు చెబితే బాగుండ‌దు. మ‌రింత డ్యామేజీ అవుతారు) త‌మ‌కు ముఖ్య‌మైన ప‌నులున్నాయ‌ని.. త‌మ ఇళ్ల‌లో వ‌చ్చే నెల‌లో శుభ‌కార్యాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ.. చంద్ర‌బాబు టూర్‌కు డుమ్మా కొడుతూ.. పార్టీ కార్యాల‌యానికి మంగ‌ళ‌వారం వ‌ర్త‌మానాలు పంపారు. సారీ.. స‌ర్‌! అని మాత్రం పేర్కొన్నారు.

నిజ‌మేకావొచ్చు. వారి ఇళ్ల‌లో పెళ్లిళ్లు ఉండొచ్చు. అంత మాత్రాన పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కులు ఇలా చేయొచ్చా? అనేది మిగిలిన వారి ప్ర‌శ్న‌. ప్ర‌ధానంగా ఎన్నిక‌ల ముందు జ‌రుగుతున్న అనేక కార్య‌క్ర‌మాల్లో చంద్ర‌బాబు స్వ‌యంగా పాల్గొని క‌ర్నూలును మించిన ప్ర‌జాద‌ర‌ణ తీసుకురావాల‌ని.. పార్టీకి బూస్ట్ ఇవ్వాల‌ని.. ఆయ‌న నిర్ణ‌యించుకున్న స‌మ‌యంలో త‌మ్ముళ్లు ఇలా సెల‌వులు పెట్టి.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు డుమ్మా కొట్ట‌డం.. ఉభ‌య గోదావ‌రి జిల్లాలే కాదు.. రాష్ట్ర టీడీపీలోనే చ‌ర్చ‌కు దారితీసింది. దీంతో అర్ధ‌రాత్రి హ‌డావుడిగా.. అనంత నేత‌ల‌కు చంద్ర‌బాబుక‌బురు పెట్టి..గోదావ‌రి జిల్లాల‌కు ర‌ప్పిస్తున్న‌ట్టు తెలిసింది.