ప్ర‌జా ఉద్య‌మాల బాటేది.. బాబూ!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.. ఇదీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంక‌ల్పం. ఇది మంచిదే. పార్టీ అధినేత‌గా, మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని అనుకోవ‌డం త‌ప్పేమీకాదు. అయితే, దీనికి సంబంధించి వేసుకుంటున్న బాట‌లే ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతున్నాయి. 14 సంవ‌త్స‌రాలు అధికార ప‌క్ష నాయ‌కుడిగా(సీఎం), 15 సంవ‌త్స‌రాలు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబు ఇంకా సెంటిమెంటునే న‌మ్ముకుని ముందుకు సాగ‌డంపై పెద‌వి విరుపులే క‌నిపిస్తున్నాయి.

విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా చంద్ర‌బాబు పేరుంది. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, సామాన్యులు గుర్తించ‌ని విజ‌న్ ఎందుకు ప‌నిచేస్తుంది? బిల్ గేట్స్‌, స‌త్య‌నాదెళ్ల‌, జోబైడెన్ వంటివారు చంద్ర‌బాబును పొగిడినంత మాత్రాన ప‌ది ఓట్లు ప‌డ‌తాయా? ఈ విష‌యం ఆయ‌న‌కు ఎందుకు అర్ధం కావ‌డం లేదో తెలియ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఓట్లు కావ‌లంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లితీరాలి. పైపై మీడియాను న‌మ్ముకుని నాలుగు మాట‌లు చెబితే ప్రయోజనం ఏంట‌ని అంటున్నారు.

అంతేకాదు, అస‌లు జ‌నం నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం టీడీపీ చేసిందా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌జ‌లు రెండు కీల‌క విష‌యాల్లో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. తెల్లారిలేస్తే.. చెత్త‌ప‌న్ను మ‌హిళ‌ల‌ను వేధిస్తోంది. నెల తిరిగే స‌రికి వ‌చ్చే విద్యుత్ చార్జీల బిల్లు కూడా వారికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది(ఎందుకంటే ఏసీ వేసుకోవాలంటే బిల్లు గుర్తుకురావ‌డమే) మ‌రి ఈ రెండు విష‌యాల‌పై ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వానికి సెగ‌తగులుతున్నా.. ప్ర‌తిప‌క్షంగా ఈ విష‌యాన్ని ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని ప్ర‌జ‌ల్లో ఉద్య‌మం నిర్మించ‌లేక‌పోవ‌డం..బాబుకు మైన‌స్‌గా మారింద‌నేది వాస్త‌వం.

ఈ మూడేళ్ల‌లో టీడీపీ చేసిన ప్ర‌జా ఉద్య‌మాలు కేవ‌లం వేళ్ల‌పై లెక్కించుకునేలానే ఉన్నాయి. ఇసుక ధ‌ర‌ల‌కు రెండేళ్ల కింద‌ట చంద్ర‌బాబు ఉద్య‌మించారు. అయితే, త‌మ్ముళ్లు క‌లిసిరాలేదు. దీంతో మ‌ధ్య లోనే దీనిని విర‌మించుకున్నారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌పై ఉద్య‌మించారు. దీనిని కూడా వ‌దులుకున్నారు. ఎస్సీ, ఎస్టీల‌పై దాడులు చేస్తున్నార‌ని కొన్నాళ్లు రోడ్డెక్కారు. అయితే, ఏమైందో ఏమో మూణ్నాళ్ల‌కే ఈ కార్య‌క్ర‌మాలు మూల‌న‌ప‌డ్డాయి. మ‌రి ఇలా అయితే, ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఎలా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేది ఎలా? ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్నివిమ‌ర్శించే క‌న్నా తాము చేసింది చెప్పుకున్నా చంద్ర‌బాబుకు భారీ విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీలకులు.