‘ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరు’

వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పై రాళ్లేస్తే భయపడే పార్టీ కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘అచ్చెన్నాయుడును వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపింది. ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడ లేదు. ఇవాళే కాదు.. రేపు కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలి.

ఓ ఫ్లెక్సీ తగులబడితే పోలీస్ డాగ్స్‌ను రంగంలోకి దింపారు. తునిలో టీడీపీ నేత మీద హత్యాయత్నం జరిగితే పోలీస్ డాగ్స్ ఏమయ్యాయి..? తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలిచారు.. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలకు కొవ్వెక్కింది. ప్రతి సందర్భం లోనూ ప్రజలను.. ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.

‘‘నా మీద రాళ్లేస్తే నేను భయపడి పర్యటనలు ఆపేస్తాన‌ని ప్రభుత్వ ఉద్దేశం. రాళ్లేస్తే నేను భయపడ తానా. .? నాపై పూలేస్తే ఆ పూలల్లో రాళ్లున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇవాళ పూలల్లో రాళ్లున్నా యన్నా రు.. రేపు పూలల్లో బాంబు ఉందని అంటారా..? కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిం చింది. కర్నూలులో వచ్చిన స్పందన చూసి నాపై రాళ్లేశారు. టీడీపీపై రాళ్లేస్తే భయపడే పార్టీ కాదు. టీడీపీ రాకుం టే తమను ఎవ్వరూ కాపాడలేరని ప్రజలు భావిస్తున్నారు.

ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని ప్రజలు నిర్ధారణకు వచ్చేశారు. మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలని ఆదోని, ఎమ్మిగనూరు ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. వైసీపీ మాట మారిస్తే మేమూ మాట మార్చాలా..? రాష్ట్రం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను కానీ.. వెనక్కు పోను. కర్నూలులో హైకోర్టు కావాలని.. విశాఖలో పరిపాలనా రాజధాని కావాలని గతంలో జగన్ఎందుకు అడగలేదు..? అప్పుడు అమరావతే రాజధానిగా ఉండాలని ఎందుకు ఒప్పుకున్నారు..? రాజకీయ పార్టీల మీద.. రాజ్యాంగ వ్యవస్థల మీద మీడియా మీద దాడులు చేస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే సీఎం జగన్ తరహాలోనే దోచుకుంటున్నారు. ప్రజల ఆస్తులను.. వ్యాపారాలను భయపెట్టి మరీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాయించేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడితే.. రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరు. టీడీపీ గెలుపు నా కోసమో.. పార్టీ నేతల కోసమో కాదు.. రాష్ట్రాభివృద్ధి కోసం. దౌర్జన్యాలు చేసిన వాళ్లపై వెధవల్లారా.. అంటూ తిరగబడితేనే దారికొస్తారు. రాష్ట్రంలో రైతు అనే వాడు బతకలేని పరిస్థితి ఉంది’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.